నరేంద్రమోడి సర్కార్ పై టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఉత్తుత్తిదే అని తేలిపోయింది. తీర్మానం ప్రవేశపెట్టటంలో టిడిపి ఎంపిలకే కాదు చివరకు అధినేత చంద్రబాబునాయుడుకు కూడా సీనియస్ నెస్ లేదన్న విషయం ఇపుడు అందరికీ అర్ధమైపోయింది. దాంతో అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అడ్మిట్ చేసుకున్నపుడున్నంత సీరియస్ నెస్ ఈరోజు కనబడటం లేదు.
అవిశ్వాస తీర్మానం ఉద్దేశ్యమేంటి ?
ఏ పార్టీ అయినా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెడుతుంది ? ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయందని చెప్పటానికి, అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. మరి ఇపుడు టిడిపి ఏం చేస్తోంది ? అవిశ్వాస తీర్మానం అడ్మిట్ అయిన తర్వాత టిడిపి ఎంపి సుజనా చౌధరి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యమేదీ తమకు లేదని స్పష్టంగా ప్రకటించారు. తాము తీర్మానం ప్రవేశపెట్టినంత మాత్రాన ప్రభుత్వం పడిపోదన్న విషయం తమకు తెలుసన్నారు. కేంద్రప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం లేనపుడు, పడిపోదని తెలిసిన తర్వాత ఇక అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టినట్లు ?
తీర్మానం వల్ల వచ్చేది లేదు పోయేది లేదు
ఇక ఈరోజు అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానం వల్ల వచ్చేది లేదు పోయేది లేదని తేల్చేశారు. అంటే తమ పార్టీ ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానంపై టిడిపి ఎంపిలే సీరియస్ గా లేరన్న విషయం అర్ధమైపోతోంది. అలాగే, కొందరు జాతీయ స్ధాయి నేతలను కలవటానికి చంద్రబాబు ఎంపిలతో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. అయితే, తమకు కేటాయించిన బృందాల్లో చాలా మంది ఎంపిలు కలవలేదట. అంటే ఎంపిల్లో ఎంతమంది సీరియస్ గా ఉన్నారో అర్దమైపోతోంది.
రెండు పార్టీల్లోనూ సీరియస్ నెస్ లేదు
అలాగే చంద్రబాబు కూడా విజయవాడలో కూర్చునే ఎంపిలకు డైరెక్షన్ ఇస్తున్నారు. చంద్రబాబులో నిజంగా సీరియస్ నెస్ ఉంటే వెళ్ళి ఢిల్లీలో కూర్చునుండే వారే. ఎంపిల్లో ఎంతమందికి జాతీయస్ధాయి నేతలతో సంబంధాలున్నాయి ? ఎంపిలకే జాతీయ పార్టీల అధినేతలు పూర్తిగా తెలియనపుడు ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకి మాత్రం ఎవరు తెలుస్తారు ? అసలు ఢిల్లీకి ప్రత్యేకంగా యనమలను ఎందుకు పంపినట్లు ? సో, జరుగుతున్న విషయాలన్నింటినీ గమనిస్తే అవిశ్వాస తీర్మానంపై ఇటు టిడిపి అటు బిజెపిల్లో రెండింటిలోనూ సీరియస్ నెస్ లేదని అర్ధమైపోతోంది.