చంద్రబాబునాయుడు మానసపుత్రిక అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ, చంద్రబాబు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంటే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజధాని నిర్మాణాన్ని ముందుకు సాగనిచ్చేది లేదంటూ అల్టిమేటమ్ జారీ చేశారు. ప్రజలందరూ చంద్రబాబు చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని పవన్ పిలుపిచ్చారు. ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఎవరిపైనైనా కేసులు పెడితే ఎదురు తిరగమన్నారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలే
పవన్ హటాత్తుగా రాజదాని నిర్మాణం తదితరాలపై ఎందుకంత చంద్రబాబుపై ఫైర్ అయ్యారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు న్యాయ, రాజకీయ, ప్రజా ఉద్యమాల ద్వారా ప్రయత్నిస్తామన్నారు. తమ హెచ్చరికలను కాదని చంద్రబాబు ముందుకుపోతే అమరావతిలో సిఎం ఇంటి ముందుకొచ్చి కూర్చుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. తనతో మాట్లాడినపుడు రాజధానికి కేవలం 1850 ఎకరాలు తీసుకుంటున్నట్లు చెప్పి ఇపుడు లక్ష ఎకరాలు తీసుకుంటున్నట్లు ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలోనే పొత్తులు
పొత్తులపై మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే తాను పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు. అదే సమయంలో చంద్రబాబు-కాంగ్రెస్ బంధం గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో రాహూల్ కు చంద్రబాబు కన్నుకొట్టి మనిద్దరం ఒకటే అని చెప్పగలరంటూ ఎద్దేవా చేశారు. జనాల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జనాలు తోలు తీసేస్తారంటూ చంద్రబాబును ఉద్దేశించి పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారింది.