ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు శివారులో బాంబు పేలుడు సంభవించి ముగ్గురు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. నంద్యాల చెక్పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో మంగళవారం మధ్యాహ్నం ఈ బాంబు పేలుడు సంభవించింది. మృతులను జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. కర్నూలు నగరంలో జంపాల కుటుంబానికి మంచి పేరుంది. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు.
ఇటీవల వీరిద్దరూ కర్నూలు నగర శివారులో రూ.20కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి మంగళవారం పొలాన్ని సర్వే చేయించారు. దీని నిమిత్తం వీరికి వరసకు సోదరుడయ్యే ఏఎస్సై జంపాల శ్రీనివాసులు, సర్వే డిపార్ట్మెంట్ డ్రైవర్ సుధాకర్ అక్కడికి వచ్చారు.వీరంతా భూమిని సర్వే చేయిస్తున్న సమయంలో కూలీలు చెత్తను ఓ చోటికి పోగుచేసి నిప్పు పెట్టారు. దీంతో తీవ్రగాయాలతో మల్లికార్జున, రాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసులు, సుధాకర్ను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
అక్కడి చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతిచెందారు. తీవ్ర గాయాలతో సుధాకర్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. అసలు ఆ స్థలంలోకి బాంబులు ఎలా వచ్చాయని విచారణ చేస్తున్నారు. ఎవరైనా వాటిని ఇక్కడ పాతిపెట్టారా? లేదంటే ఉద్దేశపూర్వకంగానే హత్య చేయాలని బాంబులు పెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి మృతులకు కుటుంబసభ్యులను పరామర్శించారు. కర్నూలు డీఎస్పీ యుగంధర్బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ ప్రాంతంలోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఎవరైనా అక్కడ బాంబులను దాచారా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.