అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఇపుడీ విషయం మీదే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు గౌరవ మర్యాదులున్న సదరు నేతకు ఇపుడేవీ లేకుండా పోయాయి. ఆ నేతే వైసిపిలో నుండి టిడిపిలో చేరిన మాజీ ఎంఎల్ఏ బి గుర్నాధరెడ్డి. సదరు నేత వేసిన ఓ తప్పటడుగు కారణంగా జిల్లాలో ప్రత్యేకించి అనంతపురంలో పూర్తిగా దెబ్బ తినేశారు. ఏదో ఆశించి అధికార టిడిపిలోకి వెళితే చివరకు ఏమీ దక్కలేదు సరికదా అవమానాలు కూడా ఎదురయ్యాయట. దాంతో మళ్ళీ వెనకొచ్చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఎవరినీ లెక్క చేయని మాజీ ఎంఎల్ఏ
ఇంతకీ విషయం ఏమిటంటే, గుర్నాధరెడ్డి వైసిపిలో ఉన్నంత కాలం బాగానే ఉన్నారు. చంద్రబాబునాయుడు ప్రజా వ్యతిరేక పాలనపై వైసిపి చేసిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనేవారు. అటువంటిది హటాత్తుగా టిడిపిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గుర్నాధరెడ్డి ఆలోచనను వైసిపిలోని చాలామంది నేతలు వ్యతిరేకించారు. పైగా గుర్నాధరెడ్డి చేరికను టిడిపిలో నేతలు వ్యతిరేకించినా పట్టించుకోకుండా సైకిలెక్కారు.
జెసి మద్దతుతోనే టిడిపిలోకి
అందరి వ్యతిరేకతను అధిగమించి ఈ మాజీ ఎంఎల్ఏ సైకిల్ ఎక్కటానికి ప్రధాన కారణం అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డే కారణం. వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున అనంతపురంలో పోటీ చేసేందుకు టిక్కెట్టు ఇప్పిస్తానన్న జెసి హామీతో గుర్నాధరెడ్డి టిడిపిలోకి మారిపోయారు. అయితే పార్టీ మారే ముందున్న వాతావరణం పార్టీలోకి మారిన తర్వాత మారిపోయింది. దాంతొ మాజీ ఎంఎల్ఏకి దిక్కుతోచలేదు. టిక్కెట్టుపై తనకు హామీ ఇచ్చిన జెసి మాటే చంద్రబాబు దగ్గర చెల్లుబాటు కాకపోవటాన్ని గుర్నాద్ గ్రహించారు. దానికితోడు టిడిపిలోకి మారిన దగ్గర నుండి ఎదురవుతున్న అవమానాలను జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది.
భే షరతుగా చేరుతారా ?
వాస్తవ పరిస్ధితులను గ్రహించిన గుర్నాద్ టిడిపిలో ఇమడలేకపోతున్నారు. జెసిని నమ్మి టిడిపిలోకి మారితే పరిస్ధితి ఇలాగయిందేమిటని ఇపుడు మాజీ ఎంఎల్ఏ తెగ బాధపడిపోతున్నారట. అందుకనే వేరే దారిలేక మళ్ళీ వైసిపిలోకి వెళ్ళటమే మంచిదని నిర్ణయించుకున్నారు. అందుకనే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కబురు చేశారు. అయితే జగన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. భేషరతుగా గుర్నాధరెడ్డి వైసిపిలోకి వస్తే బాగానే ఉంటుందని నేతలు కూడా అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.