పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా బాబుగారిలో మాత్రం ఏదో ఆందోళన మొదలైంది. కొద్ది రోజులుగా ఆయనకేదో భయం పట్టుకుంది. ఇందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఎన్డీయే నుంచి బటయకు వచ్చిన తర్వాత ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు. ఇదే సమయంలో చంద్రబాబును వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ చుట్టుముడుతున్నాయి. ఇటీవల ముంబాయికి చెందిన ఓ సంస్థతో చేయించిన అంతర్గత సర్వే ఫలితాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ముఖ్యమంత్రి పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారశైలి తదితర అంశాలపై నిర్వహించిన ఈ సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ కొద్దిపాటి మెజారిటీతోనే గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఎన్డీయేలో కొనసాగిన చంద్రబాబు వ్యవహరించిన తీరుపై ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఒకే మాటపై ఉండకుండా... ఒకసారి హోదా అవసరమీ.. అవసరం లేదు.. ప్రత్యేక ప్యాకేజీ చాలంటూ.. చంద్రబాబు ప్రజల్ని గందరగోళానికి గురిచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చెప్పిన తర్వాత చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నారు. ప్రజల్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఈ సర్వేలో చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలినట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో మొదటి నుంచీ ఒకేమాటపై ఉన్న వైసీపీ అధినేత జగన్కు ప్రజల మద్దతు పెరుగుతున్నట్లు కూడా అందులో స్పష్టమైనట్లు సమాచారం.
అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై 34శాతంమంది ప్రజలు మాత్రమే సంత`ప్తిగా ఉన్నారట. ఇక పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా మంచి మార్కులే వేశారట. కానీ, మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల పనితీరు, వ్యవహార శైలిపై ప్రజలు, అధికారులు గుర్రుగా ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలు చెబుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. కొత్త రాజధాని అమరావతి నిర్మాణ విషయంలోనూ పెద్దమొత్తంలో అవినీతి జరుగుతుందనే భావన ప్రజల్లో వ్యక్తమైనట్లు కూడా తేలినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం ఖాయమని గ్రహించిన చంద్రబాబు ఏం చేయాలో పాలుపోక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ, జనసేన, కాంగ్రెస్లు పుంజుకుంటున్న వేళ గెలుపు కష్టమేననే ఆందోళనతో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది.