పవన్ మాటలు చూడబోతే కర్నాటకలో జెడిఎస్ అధినేత కుమారస్వామినే ఆదర్శంగా తీసుకున్నట్లు కనబడుతోంది. మొన్నటి కర్నాటక ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీ స్ధానాల సంఖ్య రీత్యా మొదటి, రెండు స్ధానాల్లో నిలిచిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలను కాదని మూడో స్దానంలో నిలచిన జెడిఎస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పడింది. ఏదో సమీకరణలు కలసి వచ్చి, అదృష్టం కొద్దీ జెడిఎస్ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రయ్యారు. దాంతో అప్పటి నుండి మన రాష్ట్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను కూడా అదే పద్దతిలో సిఎం ఎందుకు కాకూడదని అనుకుంటున్నట్లు కనబడుతోంది.
జనసేనను జనాలు మరచిపోయేవారే
జనసేన పార్టీ పెట్టి ఇప్పటికి ఐదేళ్ళయింది. ఏదో గాలివాటుగా ఎప్పుడో ఒకసారి జనాల్లోకి రావటం మళ్ళీ కొద్ది రోజులు ఎక్కడుంటారో కూడా ఎవరికీ తెలీకుండా ఎటో వెళ్ళిపోవటం. ఇంతకాలం ఇలాగే జరుగుతోంది పవన్ రాజకీయం. ఏదో మెగా ఫ్యామిలీ సభ్యునిగా సెలబ్రిటీ హోదాలో పార్టీ పెట్టారు కాబట్టే పవన్ కు మీడియా కూడా అంతో ఇంతో ప్రాధాన్యత ఇస్తోంది. లేకపోతే జనసేన పార్టీని జనాలు ఎప్పుడో మరచిపోయుండే వారనటంలో సందేహమే లేదు.
30 సీట్లొస్తే సిఎం అయిపోవచ్చా ?
పార్టీ పెట్టి ఐదేళ్ళయినా ఇంత వరకూ పార్టీ నిర్మాణమే చేయలేదు. పార్టీ మొత్తం మీద పవన్ తప్ప ఇంకో నేతే కనబడరు. ప్రజా పోరాట యాత్ర పేరుతో రెండు నెలలుగా పవన్ యాత్రలు చేస్తున్న ఒక్కరంటే ఒక్క ప్రముఖ నేత కూడా ఏ పార్టీలో నుండి వచ్చి జనసేనలో చేరలేదు. వచ్చే ఎన్నికల్లో అసలు ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుందో కూడా చెప్పలేరు. అన్నీ స్ధానాల్లో జనసేన పోటీ చేస్తుందనే మొక్కుబడి ప్రకటనలు మాత్రమే పవన్ చేస్తున్నారు. ఎన్నికలు పది నెలల్లోకి వచ్చేసినా ఇంత వరకూ జనసేన తరపున పోటీ చేసేది వీరే అంటూ జనాలు చెప్పుకోవటానికి ఏ జిల్లాలో కూడా నేతలు కనబడటం లేదు. ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ మధ్య జరిగే పోరాటంలో ఏదో ఓ 30 సీట్లు గెలుచుకుంటే కుమారస్వామి లాగ ఇక్కడ తాను సిఎం అయిపోవచ్చని పవన్ అనుకుంటున్నట్లుంది. లేకపోతే 2019లో తానే సిఎం అవుతానని పవన్ కల్యాణ్ చెబితే నమ్మేదెలాగ ?