కాపుల ఓట్లు ఈసారి గుత్తమొత్తంగా ఒకే పార్టీకి పడే అవకాశాలు లేవంటున్నారు. గోఅదావరి జిల్లాలలో రాజకీయ పార్టీల తల రాతను మార్చే శక్తి సామర్ధ్యాలు ఉన్న కాపులు వచ్చే ఎన్నికలలో ఏ వైపు నిలబడతారన్న దానిపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ ఉన్నడి ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పడంతో ఈ చర్చ మొదలైంది. మరో వైపు అదే సామాజిక వర్గానికి చెందిన సినీఎ నటుడు పవన్ కళ్యాణ్ కూడా బరిలో ఉండడంతో కాపుల వైపు ఏపీ మొత్తం చూస్తోంది.
జగన్ కు బ్రహ్మరధం :
ఉభయగోదావరి జిల్లాలలో పాదయాత్ర ముగించుకుని విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్ కు ఈ జిల్లాలోనూ కాపులు బ్రహ్మరధం పడుతున్నారు. కాపు కార్పోరేషన్ కు ఏటా పది వేల కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించినందుకు జగన్ ని పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. మరో వైపు మాట మీద నిలబడినందుకు కూడా ఆయన పట్ల కాపులు విశ్వావం పెంచుకుంటున్నారు. ఉన్న విషయాన్నే జగన్ కాపు రిజర్వేషన్ల విషయంలో చెప్పారని కూడా అంటున్నారు. గోదావరి జిల్లాలలో ఆ స్టేట్మెంట్ ఇచ్చాక కూడా అక్కడ జగన్ కు కాపులే సమాదరించారు. అదే సీన్ విశాఖ జిల్లాలోనూ కనిపిస్తోంది. ఉత్తరాంధ్రాలోనూ కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
గత చరితే అదే చెబుతోందా :
కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్పించి కాపులు ఎపుడూ మూకుమ్మడిగా ఒక పార్టీని ఓడించడం, గెలిపించడం అన్నది జరగలేదని గత చరిత్ర చెబుతోంది. 1989 ఎన్నికలలో కాపులు టీడీపీని దారుణంగా తిరస్కరించారు. అప్పట్లో కాపు నాయకుడు వంగవీటి రంగా ఘోరంగా హత్య చేయబడడంతో కాపులు టీడీపీని దూరం పెట్టారు. ఆ తరువాత 1994 నాటికి కాంగ్రెస్ పాలనపై విసుగు చెంది అదే కాపులు మూకుమ్మడిగా టీడీపీకి ఓటు వేసి కాంగ్రెస్ ని పక్కన పెట్టేశారు..
మళ్ళీ అపుడలా :
ఇక 2004 ఎన్నికల టైంలో తాము ఎంతగానే అభిమానించే వైఎస్సార్ సీఏం క్యాండిడేట్ కావడంతో ఆయనకు మద్దతుగా ఉభయ గోదావరి జిల్లాలు నిలబడ్డాయి. సీట్లూ, ఓట్లూ పూర్తిగా ఇచ్చి మరీ గెలిపించాయి. 2009 వచ్చేనాటికి కాపులకు చాలా విషమ పరీక్ష ఎదురైంది. ఓ విధంగా వారికి కీలకమైన ఎన్నిక అని చెప్పాలి. తమ సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం తరఫున బరిలోకి రావడంతో కాపులు అటు వైపు మొగ్గు చూపారు. 2014 లో ఏపీ విభజన జరిగింది. సమర్ధుడైన నాయకునిగా బాబు ప్రొజెక్షన్, పైగా కాపులను బీసీలలో చేరుస్తానని హామీ ఇవ్వడంతో కాపులంతా మెజారిటీ టీడీపీకి ఓటు వేశారు.
ఇపుడు అలా ఉండదు :
ఈసారి ఎన్నికలలో అలా ఉండదని తెలుస్తోంది. . కాపులు టీడీపీ పట్ల కోపంగా ఉన్నారు. అదే టైంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కూడా ఉంది. ఇంకోవైపు వైసీపీ అధినేత జగన్ కాపు కార్పోరేషన్ కు నిధులు ఇస్తాంటున్నారు. దీంతో మెజారిటీ కాపులు ఇటే చూస్తున్నారు. ఇక కాపు యువత మాత్రం జనసేవ వెంట వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వెరసి కాపులలో చీలిక రావచ్చునన్ని అది జగన్, పవన్ ల మధ్యనే ఆగిపోవచ్చునని కూడా టాక్ నడుస్తోంది. చూడాలి. ఏమి జరగనుందో..