అవును పరిస్ధితులు చూస్తుంటే చంద్రబాబునాయుడు బాధ్యత నుండి తప్పించుకున్నట్లే కనబడుతోంది. కేంద్రం నుండి రాబట్టుకోవాల్సిన వాటి విషయంలో నాలుగేళ్ళల్లో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. విభజన చట్టం అమలు కోసం, ప్రత్యేకహోదా తదితరాల కోసమే తాను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అప్పట్లో చంద్రబాబు ఊరూ వాడా ఊదరగొట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
నాలుగేళ్ళల్లో సాధించిందేమీ లేదు
తాను అనుకున్నట్లే బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. అధికారంలోకి కూడా వచ్చారు. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవీ ఆచరణలోకి తేలేకపోయారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే అనూహ్యంగా చంద్రబాబు ఓటుకునోటు కేసులో ఇరుక్కోవటంతో మొత్తం పరిస్ధితంతా తల్లక్రిందులైపోయింది. కేసు దెబ్బకు చంద్రబాబు కేంద్రం ముందు చులకనైపోయారు. దాంతో చంద్రబాబు చేసిన ఏ ప్రతిపాదనను కూడా కేంద్రం పట్టించుకోలేదు. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ లాంటి కీలకాంశాలు కూడా అందుకే రాలేదు.
మంత్రులకు స్పందిస్తుందా ?
తాను కేంద్రంతో మాట్లాడితే ఎటువంటి ఉపయోగం ఉండదని చంద్రబాబుకు అర్ధమైపోయింది. అందుకనే రానున్న ఎన్నికలను దృష్టి పెట్టుకునే ఆ బాధ్యతలను మంత్రులు, ఉన్నతాధికారులపై మోపేసి తాను తప్పుకున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్రప్రాజెక్టులకు నిధులు తెప్పించాల్సిన బాధ్యత ఇకపై మంత్రులు, ఉన్నతాధికారులపైనే ఉందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నాలను స్పీడ్ పెంచాలంటూ చెప్పటం విచిత్రంగా ఉంది. ఇంతకాలం స్వయంగా చంద్రబాబు అడిగితేనే స్పందించని కేంద్రం ఇపుడు మంత్రులు, ఉన్నతాధికారులడిగితే స్పందిస్తుందా ?