నెల్లూరు జిల్లాలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి చాలా దారుణంగా ఉందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 10 సీట్లలో టిడిపి గెలిచింది కేవలం మూడు సీట్లు మాత్రమే అన్న విషయం తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పటికి పదేళ్ళుగా పార్టీ అధికారంలో లేదు కాబట్టి నాయకత్వం లోపం కారణంగా పార్టీ దెబ్బతినుంటుందని అందరూ సర్దిచెప్పుకున్నారు.
అప్పటికన్నా దారుణంగా తయారైందా ?
కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్ధితిలో మార్పు లేకపోతే పరిస్ధితి మరింత దిగజారిందని అందరికీ అర్ధమైపోయింది. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా పరిస్దితిలో మార్పు కనబడలేదు. ఎందుకంటే, ఇద్దరు మంత్రులు కూడా ఎంఎల్సీల కోటాలో మంత్రులవ్వటంతో పాటు వారు ప్రత్యర్ధులపై తమ పాత పగలను దృష్టిలో పెట్టుకుని నేతలను సాధిస్తున్నారు. దాంతో జిల్లాలోని నేతలందరిలోనూ మంత్రులపై తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది.
మంత్రుల ఆధిపత్య పోరాటమే కారణమా ?
2014 వరకూ టిడిపికి ఆర్ధికంగా అండదండలు అందించిన కారణంగా విద్యాసంస్ధల అధిపతి నారాయణకు చంద్రబాబు ఎంఎల్సీ కట్టబెట్టి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటి వరకూ ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలకు, పార్టీ క్యాడర్ కు, జనాలకు ఏమీ సంబంధం లేదు. అదేవిధంగా వరుసగా ఐదు ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కూడా ఎంఎల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇద్దరు మంత్రులకు ఒకరంటే మరొకరికి ఏమాత్రం పడదు. దాంతో జిల్లాలో ఆధిపత్యం చెలాయించేందుకు నేతలను వర్గాలుగా విడకొట్టేశారు. దాంతో పార్టీ చీలికలు పేలికలైపోయింది.
చంద్రబాబు సర్దుబాటు చేసినా మారలేదు
ఇక్కడ విచిత్రమేమిటంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ గొడవలు పెరుగుతున్నాయో కానీ ఏమాత్రం తగ్గటం లేదు. ఎన్నిసార్లు చంద్రబాబునాయుడు సర్దుబాటు చేద్దామన్నా సాధ్యం కావటం లేదు. తాజగా జరిగిన పార్టీ సమావేశంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో నాయకత్వ లోపం కనబడుతోందని చెప్పటంతోనే అర్ధమవుతోంది పార్టీ పరిస్ధితేంటో. సుమారు ఐదు నియోజకవర్గాల్లో పార్టీకి గట్టి అభ్యర్ధులు లేరని సమాచారం.
మరింత పుంజుకున్న వైసిపి
అదే సమయంలో వైసిపి మొన్నటి ఎన్నికలతో పోల్చుకుంటే మరింతగా బలపడిందనే చెప్పాలి. జగన్ పాదయాత్ర తర్వాత టిడిపికి చెందిన కొందరు నేతలు వైసిపిలో చేరారు. ఇంకా కొందరు చేరటానికి రెడీ అవుతున్నారు. ఆర్ధికంగా పటిష్టస్ధితిలో ఉన్న పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరటంతో వైసిపికి మంచి ఊపొచ్చింది. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే టిడిపికి పోయిన ఎన్నికల్లో వచ్చిన మూడు సీట్లైనా వచ్చే ఎన్నికల్లో నిలుపుకుంటే అదే గొప్పటన్నట్లుగా తయారైంది.