జమిలి ఎన్నికలపై న్యాయ కమీషన్ తుది నివేదిక అసమగ్రం


ఎన్నికల జరిపే విధానంలోని ఆర్ధిక రాజకీయ పాలనాపర ఇబ్బందులను తగ్గించి దేశ పరిపాలన, అభివృద్ధి ప్రాధమ్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన "జమిలి ఎన్నికలు" అనే ప్రతిపాదనకు న్యాయ కమిషన్‌ ఆమోదం తెలిపింది. "జమిలి ఎన్నికలు" తో ఎన్నికల్లో నిర్వహణలోని ప్రజాధన దుర్వినియోగ నివారణతో ప్రజాధన పొదుపు సాధ్యమవుతుందని సూచించింది. పరిపాలనా యంత్రాంగం నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టటానికి ప్రభుత్వాల ఏకాగ్రతను పూర్తిగా లక్ష్యాలపై కేంద్రీకరించేందుకు మార్గం సుగమమం అవుతుందని పేర్కొంది. 


అయితే, జమిలి ఎన్నికలపై తుదినిర్ణయం తీసుకోవడానికి ముందు, దేశవ్యాప్తంగా వివిధ ప్రజావేదికపై విస్తృత జరగాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు మూడు ప్రతిపాధనలను లేదా ఆప్షన్లను సూచించింది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం ఒక వైపు ఉత్సాహపడుతుంటే న్యాయ కమిషన్‌ మాత్రం  ఒక నిర్ణయానికి రావడానికి ఇప్పటికిప్పుడైతే సమ్మతించలేదు.


లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఒక గొప్ప ప్రతిపాదనే అయినా కూడా ఇందులో అనేక రాజ్యాంగపరమైన సంక్లిష్ట అంశాలు ముడి పడి ఉన్నాయని న్యాయ కమిషన్‌ స్పష్టం చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ అవసరమని, రాజ్యాంగ మూలస్థంబాలైన వివిధ శాసన నిర్మాణ సభలు, న్యాయ విభాగాలు, అధికార విభాగాలతో పాటు మెధావులు, రాజ్యాంగ నిపుణులు, ప్రజాస్వామ్య భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చ జరగాల్సి ఉందని, దానికి ఇంకొంత సమయం అవసరమని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. 


న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌ పదవీకాలం (నేటితో ) శుక్రవారం ముగుస్తోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరడంతో ఆయన కమిషన్‌ సర్వసభ్య సమావేశాన్ని నిన్న గురువారం జరిగింది. ఇది ముగిశాక ముసాయిదాను మాత్రం కేంద్ర హోంశాఖకు సమర్పించింద కానీ తన సిఫార్సులతో కూడిన "తుది నివేదిక" ను ఇవ్వలేదు, కాని జమిలి ఎన్నికలు నిర్వహించటానికి కొన్ని సూచనలను ఆప్షణ్లు ఇచ్చింది. 



ఈ క్రింద వివరించిన కీలకాంశాలపై న్యాయ కమిషన్‌ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. 

*హంగ్‌ పార్లమెంటు ఏర్పడితే ఏం చెయ్యాలి?

*అవిశ్వాస తీర్మానాల వల్ల కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని కుప్పకూలితే ఏం చెయ్యాలి? 

*ఏ పార్టీ ప్రభుత్వమైనా శాసన సభలను రద్దు చేసి ముందస్తుకు వెళితే దానికి పరిష్కారం ఏంటి?

*మధ్యంతర ఎన్నికలు గనక నిర్వహించాల్సివస్తే ఏర్పడే కొత్తసభ మిగిలిన కాలం మాత్రమే అధికారంలో ఉంటుంది తప్ప ఐదేళ్లూ ఉండరాదని కమిషన్‌ గతంలో అభిప్రాయపడింది. 

*జమిలి ఎన్నికలు అమలు చేసేందుకు తగిన ఫార్ములాను రాజ్యాంగంలో పొందుపరచాలని మాత్రం న్యాయ కమిషన్‌ సూచించింది.

ఈ నేపథ్యంలో, కీలకమైన జమిలి ఎన్నికల అంశంపై తన ముసాయిదా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి న్యాయ కమిషన్‌ సమర్పించింది. 




న్యాయ కమీషన్ ముసాయిదా నివేదిక లోని ప్రధానాంశాలు: 


*జమిలి ఎన్నికలతో ప్రజాధనాన్ని పొదుపు చేయొచ్చు. 
*పరిపాలనా యంత్రాంగం భారం తగ్గించొచ్చు. 
*భద్రతా బలగాలపై భారం తగ్గించ వచ్చు. 
*ప్రభుత్వ విధానాలను మెరుగ్గా అమలు పరచవచ్చు. 
*జమిలి ఎన్నికలు జరిగితే, పరిపాలనా యంత్రాంగం, తన దృష్టి ఎన్నికల ప్రక్రియలపై కాకుండా, ఏకాగ్రతతో నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా వివిధ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించవచ్చు 


న్యాయ కమీషన్ ముసాయిదా నివేదికతో, ఒక అప్పీలును ప్రజలముందున్చింది. లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు (జమ్ముకశ్మీర్‌ మినహా) ఒకేసమయంలో ఎన్నికలు జరిపే అంశంపై అభిప్రాయాలు కోరింది.




రాజ్యాంగ సవరణ తప్పదు 

రాజ్యాంగంలో ఇప్పుడు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం జమిలి ఎన్నికల నిర్వహణ ఎలాంటి పరిస్థితుల్లో సాధ్యంకాదని న్యాయ కమిషన్‌ సూచించింది. చట్టసభల నిర్వహణ, వాటి పదవీ కాలానికి సంబంధించి సవరణలు తదనుగుణంగా చేయవలసిన అవసరం తప్పనిసరి అని తెలిపింది. మరోవైపు, జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి న్యాయ కమిషన్‌ మూడు ఆప్షణ్స్ సూచించింది.


1) తొలుత 12, ఆపై 16 రాష్ట్రాలను కలిపి - నివేదికలో సూచించిన ప్రకారం, 2019లోక్‌సభ ఎన్నికలను 12రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలతో కలిపి ఒకేసారి నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అరుణాచల ప్రదేశ్‌, ఒడిశా, సిక్కింల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోనే కలిపి జరుగుతున్నాయి. 


*రాజకీయ సంకల్పం, ఏకాభిప్రాయం తోడైతే, హరియానా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, డిల్లీ ఎన్నికలను కూడా వాటితో కలిపి నిర్వహించవచ్చు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్థాన్‌ లలో ఈ ఏడాది చివరలో గానీ, 2019జనవరిలో గానీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటి అసెంబ్లీల పదవీకాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తే, 2019 సార్వత్రిక ఎన్నికల సమయం లోనే వాటికీ ఎన్నికలు జరిపించవచ్చు. అయితే, అసెంబ్లీల పదవీకాలాన్ని పొడిగించాలంటే రాజ్యాంగంలోని అధికరణం-172ను సవరించడం అనివార్యం.

*ఇక మిగతా 16 రాష్ట్రాలు, పుదుచ్చేరిల విషయంలో 2019లోనే జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి, 2021 చివర్లో వాటికి ఎన్నికలు జరపాలి. అప్పటికి 17వ లోక్‌సభ పదవీకాలం (2019 మధ్యలో మొదలైతే) దాదాపు సగం ముగుస్తుంది.  2021 మధ్యలో 16 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే, 2024 జూన్‌ నాటికి వాటి పదవీకాలం 30నెలలవుతుంది. అప్పుడు వాటిని రద్దు చేసి, అదే ఏడాది నుంచి మొత్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చు.




2) ఐదేళ్లలో రెండు సార్లు ఎన్నికలు 

ఈ విధానంలో 12రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలను 2019లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించాలి. 2021చివర్లో మిగతా 16రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరపాలి. ఇదే విధానాన్ని కొనసాగిస్తే, ప్రతి ఐదేళ్లలో రెండుసార్లు ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది.

3) ఏడాదిలో జరగాల్సినవన్నీ ఒకేసారి 

తొలి రెండు ఆప్షన్లలో సూచించిన తరహాలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోతే, ఒక క్యాలండర్‌ సంవత్సరంలో జరగాల్సిన రాష్ట్రాల ఎన్నికలన్నింటినీ ఒకేసారి నిర్వహించాలి. అన్ని రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న సమయాన్ని అందుకు ఎంచుకోవాలి. ముందుగా రద్దు చేస్తే, లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: