కత్తి మహేశ్.. పరిచయం అక్కర లేని పేరు.. తెలుగు రాష్ట్రాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన.. ఆయన మాట్లాడితే చాలు.. ఏదో ఒక లొల్లి పుట్టడం ఖాయమనే స్థాయిలో గుర్తింపు పొందారు. జనసేన అధినేత, పవర్స్టార్ పవన్ కల్యాణ్పై కామెంట్లతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కత్తి.. ఆతర్వాత ఏకంగా రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, హైదరాబాద్ నగర బహిష్కరణకు గురయ్యారు. హైదరాబాద్ పోలీసులు ఏకంగా ఆయన సొంతూరు చిత్తూరు జిల్లాలో వదిలిపెట్టారు. అయితే.. కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నా కత్తి.. మళ్లీ ఏపీలోని విజయవాడ కేంద్రంగా తన వివాద కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారట.
అయితే ఈసారి మాత్రం సొంతంగా కాకుండా.. ఓ రాజకీయ పార్టీలో చేరి, తన ప్రస్థానాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏదని అనుకుంటున్నారా..? అధికార టీడీపీ మాత్రం కాదు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీనే. ఇది వాస్తవానికి కొంత దగ్గరగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. గతంలో ఓసారి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైసీపీ ధర్నాచేసింది. అందులో కత్తి మహేశ్ కూడా పాల్గొని తన మద్దతు తెలిపి మాట్లాడారు. ఇక ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి టార్గెట్ పవన్ అనే స్పష్టంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కత్తి మహేశ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపుణ ఏదో ఒక రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని కత్తి కూడా మీడియా మిత్రులకు చెబుతున్నారట. తాను ఇక విజయవాడలోనే ఉంటాననీ.. అక్కడి నుంచే తన కార్యకలాపాలు చేపడుతానని అంటున్నాడట. అయితే.. నూతన రాజధాని అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని రిజర్వుడ్ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. కత్తి మహేశ్ వైసీపీలోకి వస్తే.. తమకు కలిసి వస్తుందనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్పై మరిన్ని విమర్శలు చేయవచ్చునని.. పవన్ విషయాన్ని మొత్తం కత్తి చూసుకుంటారని ఆయన అనుకుంటున్నారట. అయితే.. ఈ క్రమంలోనే మరో టాక్ కూడా వినిపిస్తోంది. ప్రజాసంకల్పయాత్రతో ప్రజల్లో మంచి సానుభూతి సంపాదించుకుంటున్న వేళ.. కత్తి వచ్చి వచ్చీరానీ మాటలతో వివాదాలు సృష్టిస్తే అసలుకే ఎసరుపడుతుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే.. కత్తి మహేశ్ విజయవాడకు వస్తే.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త మాటలయుద్ధం మొదలవుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.