ముందస్తు ఎన్నికలతో కెసిఆర్ ఒకవైపు హడావుడి చేస్తుంటే మరోవైపు ప్రతిపక్షాలు కూడా రెడీ అయిపోతున్నాయి. టిఆర్ఎస్ లో ఎంత హడావుడి జరుగుతోందో కాంగ్రెస్, టిడిపిల్లో కూడా అంతే స్ధాయిలో హడావుడి మొదలైపోయింది. బుధవారం నగరంలోని గోల్కొండ హోటల్లో కాంగ్రెస్, టిడిపి నేతల కీలక సమావేశం జరిగినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తుంటుందన్న విషయంపై చాలా కాలంగా సంకేతాలు అందుతున్న విషయం అందరూ చూస్తున్నదే.
కీలక నేతల సమావేశం
ముందస్తు ఎన్నికల సన్నాహాల్లో ఒకవైపు కెసిఆర్ ప్రగతి భవన్లో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన సమయంలోనే ఇంకోవైపు టిడిపి, కాంగ్రెస్ నేతల సమావేశం జరగటం గమనార్హం. ఏఐసిసి తరపున తెలంగాణా వ్యవహారల ఇన్చార్జి కుంతియా, పిసిపి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవ్వగా టిడిపి తరపున తెలంగాణా పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి హాజరయ్యారట. సరే,కుంతియా, ఎల్ రమణ స్ధాయిలో భేటీ జరిగిందంటే ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాలు లేందే సాధ్యం కాదు కదా ?
పొత్తు ఖాయం..సీట్ల సర్దుబాటే మిగిలింది
దాదాపు రెండు గంటల పాటు జరిగిన భేటీలో సీట్ల సర్దుబాటు విషయమే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణాలో టిడిపి తుడిచిపెట్టుకునిపోయిన విషయం తెలిసిందే. అందుకనే సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ దే పై చేయి. కాబట్టి 15 అసెంబ్లీ సీట్లతో పాటు 1 ఎంపి స్ధానం టిడిపికి ఇవ్వనున్నట్లు అంచనా. పొత్తుల విషయాన్ని ఉత్తమ్ ను మీడియా ప్రశ్నించినపుడు పొత్తు ఉంటుందని కానీ ఉండదని కానీ చెప్పలేదు. పైగా నవ్వుతూ భేటీ విషయాన్ని తోసిపుచ్చటంతో అందరికీ అనుమానాలు పెరిగిపోయాయి.