రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ యువతకు చంద్రబాబునాయుడు పెద్ద గాలమే వేస్తున్నారు. యువత ప్రత్యేకంగా నిరుద్యోగుల ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు పెద్ద ప్లానే వేశారు. తాజాగా వేలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించటం అందులో భాగమే. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్ళపాటు పక్కన పడేసిన చంద్రబాబు ఇపుడు హడావుడిగా అమలు చేయాలని అనుకోవటంలో రాజకీయంగా లబ్దిపొందాలని అనుకోవటం తప్ప మరొకటి కాదన్న విషయం అర్ధమైపోతోంది.
ఈరోజు ఉదయం జరిగిన క్యాబినెట్ సమావేశంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే విడుదలకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రూప్ 1, 2,3 డిఎస్సీతో పాటు పోలీసు శాఖలో కూడా ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించటం గమనార్హం.
వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తానని, లేకపోతే నిరుద్యోగ భృతిని ఇస్తానని పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి హామీని మరచిపోయారు. దాంతో రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. మొత్తానికి నాలుగేళ్ళ తర్వాత చంద్రబాబుకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని అనిపించింది. అదే విధంగా పదివేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అనుకున్నా నోటిఫికేషన్లో లోపాల కారణంగా కోర్టు నోటిఫికేషన్ ను కొట్టేసింది. మళ్ళీ సాధారణ ఎన్నికలు ఒకవైపు తరుముకొచ్చేస్తున్నాయి. నిరుద్యోగుల్లో ఆగ్రహం, యువతలో అసంతృప్తిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో కొంపముంచుతాయన్న భయంతోనే హటాత్తుగా 20 వేల ఉద్యోగాల భర్తీ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఎత్తులన్నీ తెలుసుకోలేనంత అమాయకులు కారు జనాలు. రేపటి ఎన్నికల్లో గట్టిగా సమాధానం చెప్పకుండా ఉంటారా ?