అనంతపురం జిల్లాలో జేసి బ్రదర్స్ అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ వైసిపి నేత కేతిరెడ్డి పెద్దరెడ్డి మండిపడ్డారు. ఇకపై వారి ఆటలు సాగనివ్వనంటూ వారికి పెద్ద వార్నింగే ఇచ్చారు. గుత్తి సబ్ జైలు నుండి పెద్దారెడ్డి విడుదలైన సందర్భంగా నియోజకవర్గంలోని మద్దతుదారులు, అభిమానులు భారీ కాన్వాయ్ ఏర్పాటు చేశారు. పోయిన నెల 28 వ తేదీన నియోజకవర్గంలోని తిమ్మంపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ-టిడిపి కార్యకర్తల మధ్య గొడవైంది. ఆ గొడవకు పెద్దారెడ్డే కారణమంటూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. దాంతో పెద్దరెడ్డి ఇపుడు బెయిల్ పై విడుదలయ్యారు.
ఆ సందర్భంగానే భారీ ప్రదర్శన జరిగింది. అప్పుడు పెద్దారెడ్డి మాట్లాడుతూ, జేసి సోదరులపై విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే సోదరులిద్దరూ ఆందోళనపడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాన్న ఉద్దేశ్యంతోనే అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతున్నారట. అందులో భాగంగానే తనపై జేసి సోదరులు కేసులు పెట్టిస్తున్నట్లు పెద్దారెడ్డి చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్దితుల్లోను జేసి బ్రదర్స్ ను గెలవనిచ్చేది లేదన్నారు. అందుకోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేస్తానన్నారు. రాబోయేది జగన్ రాజ్యమేనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదని కూడా చాలెంజ్ విసిరారు. పోలీసులు జేసి ఇంటి మనుషాల్లా తయారయ్యారంటూ విమర్శించారు. తాడిపత్రిని జేసి సోదరులు బీహార్ లాగ మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సాగవంటూ హెచ్చరించారు.