మానవసేవే మాధవ సేవ..గాంధీ నినాదం!

Edari Rama Krishna

భారత దేశం  బ్రిటీష్ పాలనలో ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో..ఎలాంటి ఆయుధం లేకుండా తన అహింసా మార్గంతో బిట్రీష్ ప్రభుత్వం మెడలు వంచిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ.  శాంతి, అహింస, మానవసేవను ఆయుధాలుగా తీసుకుని స్వాతంత్ర సమరంలో విజయం సాధించిన త్యాగమూర్తి మహాత్మగాంధీ. 


నైతికత – క్రమశిక్షణ

ఇంతకుముందే చెప్పుకున్నట్టు గాంధీజీ నైతికతకు, క్రమశిక్షణకు మారుపేరు. గాంధీజీ నైతికత, క్రమశిక్షణల గురించి తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.. తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఇలా రాశారు. ‘తన మాటలనే ఆయన కొలమానంగా తీసుకునేవారు. ఆయన అనుసరించిన తర్వాతే ఇతరులకు చెప్పేవారు. ఎదుటివాళ్లు అనుసరిస్తారా.. లేదా అనేది వారిష్టం. ఎవరినీ నొప్పించేవారు కాదు. తన మార్గంలో ఎక్కడైనా, ఎప్పుడైనా అవరోధాలు ఏర్పడితే వాటిని తానే అధిగమించేందుకు ప్రయత్నించేవారు. తన మాటలకు, మార్గానికి ఆయనే ఆది. సత్యం, అహింసలతో నైతికతకున్న ప్రాముఖ్యతను, దాంతో అలవడే క్రమశిక్షణను ప్రపంచానికంతటికీ చాటిచెప్పారు.’


మానవసేవే మాధవ సేవ

మనిషిని మనిషిగా చూడాలనేది గాంధీ సిద్ధాంతం. అతను తెల్లవాడైనా, నల్లవాడైనా ఒకటే. ప్రపంచంలో ఏ మూల ఉన్నా అతడ్ని మనిషిగానే చూడాలి తప్పా.. స్వదేశీయుడిగానో, విదేశీయుడిగానో చూడొద్దని గాంధీజీ చెప్పేవారు. ‘ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు, సాయం చేసినప్పుడు మనిషి విలువ మరింత పెరుగుతుంది. అంతకు మించిన మాధవ సేవ ఏముంటుంది..’ అనేవారు.

గాంధీ కలలుకన్న దేశం

ఆడవాళ్లు కూడా అర్ధరాత్రి ఒంటరిగే తిరగగలిగేంత స్వతంత్ర్యదేశం కావాలి. అంటే మహిళలు కూడా పురుషులతో సమానంగా స్వేచ్ఛ అనుభవించాలనేది జాతిపిత ఆకాంక్ష. అగ్రవర్ణాలు, నిమ్నవర్గాలనే లేని దేశం ఉండాలని ఆయన ఆశించారు.. అంటరానితనం, మద్యపానం, మాదకద్రవ్యాలు లేని భారతాన్ని చూడాలనేది గాంధీ ఆశ.

 

వదిలిపెట్టాల్సిన వ్యసనాలు

ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా వదిలిపెట్టాల్సిన వ్యసనాలు కొన్నింటిన గాంధీజీ సూచించారు. అవి 1.సోమరితనం, 2.వ్యక్తిత్వం లేని జ్ఞానం 3. సిద్ధాంతం లేని రాజకీయం 4. త్యాగంలేని మతం. 5.నైతికత లేని వ్యాపారం. 6.మానవత్వం లేని విజ్ఞానం. 7.ఇతరులకు నచ్చనివిధంగా నడుచుకోవడం... ఇవి వ్యక్తిగతంగానే కాక సమాజానికి కూడా నష్టం చేకూరుస్తాయని గాంధీజీ చెప్పారు.   

 

గాంధీ మార్గం అద్వితీయం.. అనిర్వచనీయం.. అనుసరణీయం. అందుకే నేటికీ ఆయన నేర్పిన పాఠాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన వ్యక్తిత్వం, ఆయన నాయకత్వ లక్షణాలు ప్రపంచదేశాలను ఆకట్టుకుంటున్నాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మాత్రమే ఆయన్ను స్మరించుకోవడం కాదు. నిత్యం స్మరించుకోవాలి. ఆయన బాటలో నడవాలి. జోహార్ జాతిపితా..!!  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: