ఓటుకు నోటు కేసు లో కదలిక... ఇక నుంచి అరెస్టుల పర్వం..!
తెలంగాణ లో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి మీద ఉన్న ఓటుకు నోటు కేసు కు ఇప్పుడు పురోగతి వచ్చింది. టీడీపీకి ఓ ఎమ్మెల్సీని గెలిపించుకునే బలం వున్నా, పార్టీ ఫిరాయింపులతో టీడీపీని ఇరకాటంలో పడేసింది టీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకుంటే, తెలంగాణలో పుంజుకోవచ్చనీ, టీఆర్ఎస్ ఫిరాయింపుల అక్రమాన్ని తెలంగాణ సమాజం ముందు బలంగా చాటి చెప్పాలనీ భావించి, భంగపడింది టీడీపీ.
అసలు విషయానికొస్తే, ఇటీవల రేవంత్రెడ్డి ఇంట్లో 50 గంటలకు పైగా సోదాలు జరిగాయి ఓటుకు నోటు కేసుకు సంబంధించి. న్యాయవాది రామారావు ఫిర్యాదు మేరకే సోదాలు జరిగినట్లు ప్రచారం జరుగుతున్నా, అసలు కథ వేరు. రేవంత్ని బుక్ చేయడానికి పక్కా వ్యూహం పన్నిన తెలంగాణలోని అధికార పార్టీ, అంతే వ్యూహాత్మకంగా రామారావుని రంగంలోకి దించింది. 40 గంటలకు పైగా సోదాలు, 30 గంటలకు పైగా రేవంత్రెడ్డిపై విచారణ.. అనంతరం పలువురికి నోటీసులు జారీచేశారు ఐటీ అధికారులు.
ఈ నోటీసుల నేపథ్యంలో నేటి నుంచి ఒకరొకరుగా ఆదాయపు పన్నుశాఖ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి, ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబాస్టియన్ తదితరులూ ఈ విచారణకు హాజరవుతారు. రేవంత్రెడ్డి సైతం విచారణకు హాజరుకావాల్సి వుంది. విచారణ తర్వాత అరెస్టులు వుంటాయన్న ప్రచారం చాలా గట్టిగా సాగుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణం హీటెక్కిన ఈ పరిస్థితుల్లో 'అరెస్టులు' అంటూ జరిగే, పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోబోతోందన్నది నిర్వివాదాంశం.