గొట్టిపాటి రవి! ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాయించుకున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కరణం బలరామకృష్ణమూర్తి వర్సెస్ గొట్టిపాటి వర్గాల మధ్య పోరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినవే. ఇద్దరు నాయకులు కూడా ఒకరు తూర్పు అయితే, మరొకరు పడమర రాజకీయాలు చేసిన వారే. అలాంటి వారు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. అయినా కూడా ఒకరంటే ఒకరికి పడకపోవడం, అంతర్గత రాజకీయాలు వంటివి పెద్ద ప్రభావం చూపిస్తున్నాయి. మొత్తానికి ఈ పరిణామాలను గమనిస్తున్న నాయకులు వీరిద్దరు మారేది లేదని ఖచ్చితంగా చెబుతున్నారు. ఇక, వచ్చే ఎన్నికలకు సంబంధించి రాజకీయాలు ఊపందుకున్న విషయం తెలిసిందే.
2014లో ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి వైసీపీ జండాపై విజయం సాధించిన గొట్టిపాటి.. అనంతరం చంద్రబాబు పిలుపు మేరకు ఆయన పార్టీ మారిపోయి.. సైకిల్ ఎక్కేశారు. ఇక, మరో ఏడెనిమిది మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. దీంతో మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి. అయితే, ఇప్పుడున్న పరిస్థితిలో అద్దంకిని యథాతథంగా మళ్లీ గొట్టిపాటికి అప్పజెప్ప డం అంత ఈజీకాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అయితే కరణం టీడీపీలోను, గొట్టిపాటిరవి వైసీపీలోనూ ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ, ఇప్పుడు ఇద్దరూ కూడా ఒకే పార్టీలో ఉండడంతో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు తీవ్రంగా ప్రతిఘటించే ఛాన్స్ ఉంటుంది దీనిని దృష్టిలో పెట్టుకుంటే.. గొట్టిపాటినే సీటు మార్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
వాస్తవానికి అద్దంకి బాధ్యతలు గొట్టిపాటికే అప్పగిస్తున్నట్లు ఒక దశలో సీఎం ప్రకటించారు. దీంతో కొద్ది కాలం అద్దంకి రాజకీయాలకు దూరంగా ఉన్న కరణం కుటుంబం మళ్లీ అద్దంకి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటోంది. పై పెచ్చు అద్దంకి నుంచే పోటీలో ఉంటామంటూ వారు ప్రకటించడంతో మరింత గందరగోళం నెలకొంది.
ఒక దశలో కరణం ఫ్యామిలీని అద్దంకిలో నిలిపి గొట్టిపాటిని పర్చూరు పంపుతారన్న ప్రచారమూ సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నరసారావుపేట ఎంపీగా పంపి... అక్కడే నివాసం ఉంటోన్న రవిని చిలకలూరిపేట నుంచి అసెంబ్లీ రేసులో దింపుతారన్న వార్తలు టీడీపీలో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇదే జరిగితే అద్దంకి కింగ్గా ఉన్న గొట్టిపాటి ఆ నియోజకవర్గానికి దూరం కాక తప్పని పరిస్థితి.