రాజకీయాలకు-సినీ ఇండస్ట్రీకి మద్య ఉన్న అవినాభావ సంబంధం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా ఈ బంధం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ రాజకీయాలను వినియోగించుకుని సినీమా స్టారు ఎదగడం, సినిమా స్టార్లను అడ్డపెట్టుకుని రాజకీయాల్లో నాయకులు గెలుపు గుర్రాలు ఎక్కడం తెలిసింది. ఈ క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరింత ప్రాధాన్యం ఉంది. ఇక, ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పుకొంటే.. ఏపీలో అధికార పక్షానికి లభిస్తున్న సినీ గ్లామర్ కన్నా కూడా వైసీపీకి లబిస్తున్న గ్లామరే ఎక్కువని చెప్పాలి. అనేక మంది నటులు ఒకరిద్దరుగా వచ్చి జగన్కు మద్దతు పలకడం తెలిసిందే. ఇటీవల ప్రముఖ దర్శకుడు మహిళలు ఆరాధించే డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చి రెడ్డి వచ్చి జగన్ పాదయాత్రలో పాల్గొని వెళ్లారు.
దీనికి ముందు అనేక మంది హాస్య నటులు, క్యారెక్టర్ నటులు, మంచు ఫ్యామిలీ హీరో కూడా జగన్కు మద్దతు ప్రకటించిన వారిలో ఉన్నారు. అయితే, తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్రజలకు పలు పథకాలపై అవగాహన కల్పిస్తు న్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈకార్యక్రమం ప్రచారంలో సినీ నటులు పాల్గొని స్వయంగా ప్రచారానికి దిగడం సర్వత్రా వైసీపీ శ్రేణుల్లో ఆనందం నింపింది. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో కార్యకర్తలందరూ వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సినీనటుడు పృధ్వీరాజ్ అన్నారు.
వైసీపీ బలోపేతానికి పార్టీ అధిష్టానం ప్రకటించిన రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తాజాగా విజయవాడలోని రైల్వేస్టేషన్ సమీపంలోని కేదారేశ్వరపేట, ఖుద్దూస్ నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పృద్విరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు వీధుల్లో ప్రచారం చేశారు.
కాగా, గతంలోనూ పలువురు సినీ ప్రముఖులు వైసీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని బలోపేతం చేశారు. ఈ పరిణామాలు పార్టీని బలోపేతం చేసే దిశగా ఉంటున్నాయని అంటున్నారు పరిశీలకులు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు పార్టీకి ప్లస్ అవుతాయని చెబుతున్నారు. గతంలో వైఎస్ ఉన్నప్పుడు కూడా పలువరు టాలీవుడ్ హీరోలు, ఆర్టిస్టులు ఆయనకు మద్దతివ్వడం గమనార్హం.