ఏపీలో రాజకీయం ఓ రేంజిలో సాగుతోంది. నాయకులు శ్రుతి మించి రాగాన పడుతున్నారు. ఒకరిని ఒకరు ఘాటైన పదజాలంతో తిట్టుకుంటున్నారు. వర్తమాన రాజకీయం చూసిన వారికి ఏవగింపు కలిగేలా నేతలు వ్యవహరిస్తున్నారనిపిస్తోంది. ఇక్కడ అనుభవం అక్కరలేదు, సీనియర్లు జూనియర్లు అన్న తేడా అంత కంటే లేదు. నోటికొచ్చినట్లు తిట్టుకోవడమే పని
నారాసురుడు :
చంద్రబాబును మహిషాసురిడితో పోలుస్తూ జగన్ చేసిన కామెంట్ ఇది. నారాసురుడి పీడను జనం తొందరలోనే వదిలిస్తారని జగన్ బొబ్బిలి మీటింగులో చెప్పారు. ఆ మహిషాసురుడి ఏలుబడిలో మహిళలకు రక్షణ లేదని, ఈ నారాసురుడి పాలనలోనూ అదే జరుగుతోందని జగన్ పోలిక తెచ్చారు. రాక్షకులకు శిక్ష తప్పదని, ఎన్నికల వేళ బాబు సర్కార్ ని జనం పక్కన పెడతారనీ జగన్ హాట్ కామెంట్స్ చేశారు.
జగనాసురుడు :
ఇక టీడీపీ ఈ తిట్ల పురాణంలో ఆరితేరిపోయింది. వాళ్ళను గిచ్చి వదిలితే వూరుకుంటారా. అందుకే మంత్రిణీ పరిటాల సునీతమ్మ రెచ్చిపోయారు. జగన్ ని ఏకంగా జగనాసురుడు అంటూ రాక్షసున్ని చేసేశారు. జనాలకు చేసే మంచిని అడ్డుకునే దానవుడు అంటూ విరుచుకుపడ్డారు. జగన్ కి అంతా చెడు మాత్రమే కనిపిస్తుందని, ఆయనది రాక్షస అవతారని టీడీపీ విప్ కూన రవికుమార్ విమర్శించారు.
బుల్డోజర్లతో తొక్కిస్తా :
ఇది మామూలు మనిషి అన్న మాట కాదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నలభయ్యేళ్ళు రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు చంద్రబాబు అన్న మాటలు ఇవి. శ్రికాకుళం తిత్లీ బాధితుల పరామర్శ వేళ తనను నిలదీసిన జనాన్ని ఉద్దేశించి సహనం కోల్పోయి బాబు అన్న మాటలు ఇవి. అంతే కాదు. కోరలు పీకుతా, తోకలు కట్ చేస్తా ఇవన్ని బాబు గారి వాడుక భాషలే సుమా
ఆయన తీరు అదే :
ఇక ఈ మధ్యనే స్పీడ్ అవుతున్న జనసేనాని పవన్ కళ్యాన్ సైతం తానూ తీసిపోనంటున్నారు. . ఆయన కవాతులో ఏకంగా ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. గోదాట్లో కలిపేస్తామని హెచ్చరించారు. చంపుళ్ళు, నరుకుళ్ళు ఇపుడు సినిమాల్లో కాదు రాజకీయాలో సాధారణ విమర్శలు అయిపోయాయి. ఎందుచేతనంటే ఎవరికీ సహనం లేదు. సిధ్ధాంతం అంత కంటే లేదు. ఒకరిని ఒకరు ఎంతలా దూషించుకుంటే అంతలా మీడియా కవరేజ్ కూడా వస్తోంది. అదీ విషయం
.