నందమూరి ఆత్మ "తెలుగువారి ఆత్మగౌరవం" పై చంద్రబాబు మరోసారి వెన్నుపోటు


మామను వెన్నుపోటుతో కడతేర్చిన అల్లుడు ఇప్పుడు ఆయన కీర్తిశేషమైన తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమైన "తెలుగు ప్రజల ఆత్మాభిమానం" అనేదాన్ని నిలువెత్తు గోతిలో పూడ్చేసి కీర్తి శేషుణ్ని మరోసారి కడతేర్చారు.


ఇక నుండి వైసిపి వాళ్లు అంటున్నట్లు తెలుగుదేశం పార్టీ పిల్ల కాంగ్రెస్ అయినట్లే! వైసిపి వాళ్లకున్న పాప పంకిలం అయిన పిల్ల కాంగ్రెస్ అనే టైటిల్ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయినట్లే! చంద్రబాబు నేటితో నందమూరి తారక రామారావు గారి ఆత్మకు చివరిసారిగా అంత్యక్రియలు చేసినట్లే.

 


పిల్ల నిచ్చిన మామ నందమూరి తారక రామారావు గారిని రాజకీయంగా వెన్నుపోటు పొడిచి, ఆయన వ్యవస్థాపకమైన తెలుగు దేశం పార్టీ పగ్గాలు హైదరాబాద్ లోని వైస్రాయ్ హోటల్ (నేటి మారియట్) సాక్షిగా లాక్కున్న అల్లుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీని ఆమూలాగ్రం భ్రష్టు పట్టించేయడంలో శక్తివంచన లేకుండా కృషిచేశారు. తెలంగాణ లో ఎనిమిది సీట్లను సాధించటం కోసం కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీని తాకట్టు పెట్టి, ఆపై, ఆంధ్రప్రదేశ్‌లో ఆ అపూర్వమైన పార్టీకి మరణశాసనం లిఖించారన్నమాట సాంప్రదాయ తెలుగు దేశం పై ప్రేమ ఉన్నవారి హృదయాలు ద్రవించటం జరుగుతూనే ఉంది.

టీడీపీ - కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోనే పరిస్థితులు వస్తే "ఆత్మహత్య చేసుకుంటా.." అని ఈ మధ్యనే టీడీపీ ముఖ్యనేత కె.ఈ. కృష్ణమూర్తి ఉద్వేగంగా అన్నారు. ఆయన ప్రభుత్వంలో అతి కీలకమైన పదవిలో వున్నారు. చంద్రబాబు - రాహుల్‌ తో భేటీ అయ్యాక ఆ ముఖ్యనేత ఏమై పోతారో? నని రేపు ఆయన ఆత్మహత్య వార్తలు వస్తాయేమో? నని ఆయన అనుచరగణం తీవ్ర ఆందోళన చెందుతోంది. అలాగే మరో టిడిపి నేత అయ్యన్నపాత్రుడు కూడా గత ఆగష్టులో స్పందించారు. 


'దేశ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..." అంటూ నారా చంద్రబాబు నాయుడు ఆవు కథలు చెప్పుకోవచ్చు. కానీ, స్వర్గీయ నందమూరి తారక రామారావుకీ, తెలుగు జాతికీ అసలు సిసలు వేటు వెనక నుండి అదే  'వెన్నుపోటు' నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే వేశారన్నది అత్యధిక తెలుగు ప్రజల మెజార్టీ అభిప్రాయం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పణంగా పెట్టానని ..చెప్పకనే చెప్పారు చంద్రబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: