ఆయనకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. మంత్రి పదవులు సుదీర్ఘ కాలం చేసిన చరిత్ర కూడా ఉంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా నెగ్గిన ఆయన ఇపుడు ఓ చిన్న పట్టణానికి కౌన్సిలర్ గా పోటీ చేస్తానంటున్నాడు. మరి ఆయనకు ఏమైంది. హై కమాండ్ పై నిరసనలో ఇదో రకంగా భావించాలా..
జేసీ సంచలన వ్యాఖ్యలు :
తాను ఇక రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఎంతకాలం నుంచో చెబుతూ వస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన మరో కొత్త ట్విస్ట్ దీనికి చేర్చారు. తాను తాడిపత్రి మునిసిపాలిటీకి కౌన్సిలర్ గా పోటీ చేస్తానని జేసీ చెప్పడంతో విన్నవారు అవాక్కయ్యారట. కానీ జేసీ ఇదే పదే పదే చెప్పడంతో అది నిజమేనేమో అనుకుంటున్నారుట. ఇంతకీ జేసీ ఎందుకలా ప్రకటించారు, దీని కధా కమామీషూ ఏంటన్నది చూస్తే వెనకాల పెద్ద కధే ఉందనిపిస్తోంది.
బాబు హామీ ఇవ్వలేదుగా :
ఈ మధ్యనే చంద్రబాబు వద్దకు జేసీ ఓ రాయబేరం మోసుకెళ్ళారు. అనంతపురం ఎంపీ టికెట్ తన కుమారుడు పవన్ కి ఇమ్మని బాబుకు విన్నవించుకున్నారు. దానికి బాబు ప్రతిగా ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల చేత పవన్ అభ్యర్ధిత్వానికి అంగీకారం తీసుకురమ్మన్నారుట. దీంతో మండుకొచ్చిన జేసీ వారంతా ఓడిపోయేవారేనంటూ బాబుకు ఘాటుగా చెప్పారట. మరి నీ కొడుకు మాత్రం ఎలా గెలుస్తారంటూ బాబు ఎదురు ప్రశించడంతో జేసీకి నోట మాట రాక వెనుతిరిగి వచ్చేశారట. ఇదీ జేసీ కౌన్సిలర్ పోటీ ప్రకటన వెనక నేపధ్యమన్నమాట.
తాడిపత్రికి కుమారుడే :
ఇక జేసీ చంద్రబాబుతో లాభం లేదనుకున్నారో ఏమో కానీ తాడిపత్రి ఎమ్మెల్యే సీటుకు తన కుమారుడే టీడీపీ అభ్యర్ధి అంటూ ప్రకటించేశారు. తాను ఎమ్మెల్యేగా, కుమారుడు ఎంపీగా అనుకున్న జేసీకి బాబు ఝలక్ ఇవ్వడంతో ఇలా సింగిల్ సీటుకే ఆయన పరిమితం అయ్యారని భోగట్టా. ఇక బాబు మీద నిరసన ఎలా తెలియచేయాలో అలాగే తెలియచెప్పిన జేసీ నోటి నుంచి ఈ కౌన్సిలర్ పోటీ మాట పుట్టిందంటున్నారు. మొత్తానికి జేసీ ఫెయిర్ బ్రాండ్ ముద్రను డెబ్బయి అయిదేళ్ళ వయసులోనూ కొనసాగిస్తున్నారు. దటీజ్ జేసీ మరి.