తెలంగాణలో సాధారణ ఎన్నికల సంగ్రామం హాట్ హాట్గా ఉంది. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్కి కాస్త ఆధిక్యత ఉంటే దక్షిణ తెలంగాణలో మహాకూటమి ముందంజులో ఉంటుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం పీటాన్ని డిసైడ్ చేసేది మాత్రం గ్రేటర్ హైదరాబాదే అన్నది మెజారిటీ రాజకీయ వర్గాలు, విశ్లేషకుల అంచనా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కూకట్పల్లి నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కూకట్పల్లి నియోజకవర్గం ఏర్పడింది. ఆంధ్రా సెటిలర్స్కు అడ్డాగా ఉన్న కూకట్పల్లిలో 2009లో జరిగిన ఎన్నికల్లో లోక్సత్తా అధినేత జయప్రకాశ్నారాయణ విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాధవరం కృష్ణారావు 43,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ నేపధ్యంలో ఆయన సైకిల్ దిగి కారెక్కేశారు. తాజా ఎన్నికల్లో మాధవరం కృష్ణారావు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతుంటే మహాకూటమి తరపున దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మనవరాలు, దివంగత మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టీడీపీ నుంచి బరిలోకి దిగుతోంది. నందమూరి ఆడపడుచు ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తుండడంతో కూకట్పల్లి సీటు రాజకీయం యమ హాట్ హాట్గా మారుతోంది. ఇదే సమయంలో ఇక్కడ నుంచి బీజేపీ తరపున టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు సమీప బంధువు మాధవరం కాంతారావు పోటీ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ ముగ్గురూ హేమాహేమీలు రంగంలో ఉన్నట్లే అవుతోంది. నియోజకవర్గంలో 3.37 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో ఏపీ నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడిన సెటిలర్స్ అత్యధికులు కావడం విశేషం.
మొత్తం 3.37 లక్షల మంది ఓటర్లలో 2 లక్షల వరకు ఏపీ నుంచి వచ్చిన సెటిలర్స్ ఓట్లే ఉంటాయని అంచనా. అంటే ఓవర్ ఆల్గా నియోజకవర్గంలో 60 శాతం మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే. అలాగే స్వల్పంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కూకట్పల్లి ప్రాంతం ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2009లో టీడీపీ పోత్తులో భాగంగా ఇక్కడ టీఆర్ఎస్ తరపున సుదర్శన్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో తొలి సారిగా తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణారావు 43,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అటు టీఆర్ఎస్ నుంచి కృష్ణారావు ఉంటే కృష్ణారావుకు వైసీపీ నుంచి కూడా సపోర్ట్ లభిస్తోంది. తాజాగా నియోజకవర్గంలో ఉన్న రాయలసీమకు చెందిన ఓ సామాజికవర్గం ఓటర్లు సమావేశం ఏర్పాటు చేసుకుని మహాకూటమిని చిత్తుగా ఓడించాలని తెలంగాణలో టీఆర్ఎస్ను గెలిపించాలని తీర్మానించడంతో టీఆర్ఎస్కు జోష్ వచ్చింది.
అదే సమయంలో గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఒక్క సీటు మినహా అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం కూడా ఆ పార్టీకి సానుకూలతగా అనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని సానుకూలతల విషయానికి వస్తే నియోజకవర్గంలో బలంగా ఉన్న సెటిలర్ల ఓట్లతో పాటు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వెన్నుదన్నుగా ఉండే సామాజికవర్గం ఓటర్లు బలంగా ఉండడం కలిసిరానుంది. అలాగే మరో బలమైన సామాజికవర్గం సైతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతోంది. ఇక నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండడం ఒక ఎత్తు అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరడం ఓ మైనస్. గత ఎన్నికల్లో తెలుగుదేశానికి వచ్చిన 43,000 ఓట్ల మెజారిటీతో పాటు ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా పోటీ చేస్తుండడం కూడా ఆమెకు కలిసిరానుంది.
గతంలో కృష్ణారావు విజయానికి పని చేసిన పాత కేడర్లో ఇప్పుడు కీలక నాయకులు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే పార్టీలతో సంబంధం లేకుండా నందమూరి అభిమానులు సుహాసినికి ఓటు వెయ్యాలని నిర్ణయం తీసుకోవడం కూడా ఆమెకు కలిసిరానుంది. ఇన్ని సానుకూలతలు ఉన్నా సుహాసిని ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించడంతో పాటు కొంత మంది కీలక నాయకులను కలుపుకుపోవడం లేదన్న ఆరోపణ, రాజకీయాలకు కొత్త కావడంతో ఆమె ప్రసంగంలో పదును లేదన్న టాక్ అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతం కూకట్పల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న గొట్టుముక్కల పద్మారావు టీఆర్ఎస్ను వీడడం కూడా ఆ పార్టీకి ఎదురు దెబ్బే కానుంది.
ఏదేమైనా ఇటు టీడీపీ, కాంగ్రెస్ కలయిక, సెటిలర్ల ఓట్లు నందమూరి ఫ్యామిలీ బ్రాండ్తో పాటు నందమూరి ఆడపడుచుగా పోటీ చేస్తున్న సుహాసిని.. అటు స్థానికుడు నియోజకవర్గంలో పార్టీ మారినా కొంత వరకు అభివృద్ధి చేసిన కృష్ణారావుకు మధ్య రసవత్తర పోరే జరగనుందని రాజకీయ వర్గాల అంచనా. ఏదేమైనా ఇక్కడ అభ్యర్థుల గెలుపు, ఓటమిలను సెటిలర్లే డిసైడ్ చెయ్యనున్నారు. అదే సమయంలో సుహాసిని గెలుపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఏపీ నుంచి ప్రత్యేక టీమ్ను ఈ పది రోజుల పాటు రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది.