ఈ సారి ఎన్నికల్లో వాళ్లదే హవా ... లగటిపాటి తేల్చేశాడు...!
లగటి పాటి సర్వేలకు ఆంధ్ర ప్రదేశ్ అలాగే తెలంగాణ లో మంచి గిరాకీ , నమ్మకం ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు లగటి పాటి ఎన్నికల గురించి రోజుకొక కొత్త న్యూస్ చెబుతూ ఆసక్తి ని రేపుతున్నాడు. ఇక, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి తన టీమ్తో సర్వేలు చేయిస్తున్నారు. పోలింగ్ రోజు వరకూ ఆ సర్వే జరుగుతుందట. పోలింగ్ పూర్తయ్యాక, తన సర్వే వివరాల్ని వెల్లడిస్తానని చెబుతున్నారు లగడపాటి రాజగోపాల్. ఈలోగా, తనదైన స్టయిల్లో స్వతంత్ర అభ్యర్థులపై జోస్యం చెప్పేశారీ ఆంధ్రా ఆక్టోపస్.
ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులతో ఝలక్ తప్పదని సెలవిచ్చారు లగడపాటి రాజగోపాల్. మొత్తంగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు తెలంగాణ ఎన్నికల్లో గెలిచే అవకాశముందట. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకూ లోను కావడంలేదని లగడపాటి రాజగోపాల్ ప్రకటించడం గమనార్హం. ప్రధాన పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, జనం మాత్రం కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నారన్నది ఆయన వాదన. 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారన్న సమాచారం తనకే ఆశ్చర్యం కలిగించిందని లగడపాటి అంటున్నారు.
రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తానని చెబుతున్న లగడపాటి, ఈరోజు కోటా కింద నారాయణ్పేట్ - శివకుమార్రెడ్డి. బోధ్ - అనిల్ జాదవ్ గెలుస్తారని వెల్లడించారు. సర్వేలు చేసుకోవచ్చనీ, ఫలితాలు వెల్లడించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలున్నా.. ఓ జాతీయ ఛానల్ టీఆర్ఎస్కి 70 సీట్లు వస్తాయని ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా, లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాల్ని వెల్లడించిన దరిమిలా ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.