ఏపీ సీఎం చంద్రబాబుకు బెంగ పట్టుకుందా? లేక ఆయన భయపడుతున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే పొలిటికల్ సర్కిళ్ల లో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు ధైర్యంగానే ఉన్న చంద్రబాబు గడిచిన రెండు మూడు రోజులుగా మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకపక్క రాష్ట్రాన్ని తాను అభివృద్ది చేస్తున్నానని చెబుతున్నా.. మరోపక్క, పాలనకు సంబంధిం చిన శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నా కూడా చంద్రబాబులో మాత్రం ఏదో తెలియని ఆందోళన మాత్రం కనిపిస్తోంది. ఎందుకు? ఏంటి? ఎలా? అనే ప్రశ్నలు వస్తే.. కీలక అంశాలు తెరమీదికి వస్తున్నాయి. ఏ వేదిక ఎక్కినా చంద్రబాబు ఒకే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఏపీకి ప్రధాని మోడీ ఎందుకు వస్తున్నారు? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా ఇదే వైఖరి కనిపిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 6న గుంటూరు రానున్నారు. బీజేపీ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగి స్తారు! ఇక ఈ విషయం తెలిసిన దగ్గరనుంచి కూడా చంద్రబాబు తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. మోడీ ఏపీకి ఎలా వస్తారని? ఎందుకు వస్తారని? ఏ మొహం పెట్టుకుని వస్తారని? అంటూ.. నిజానికి మోడీ ఏపీకి వస్తున్న విషయాన్ని బీజేపీ నాయకులు కూడా ప్రచారం చేయని విధంగా చంద్రబాబు ప్రచారం చేసి పెట్టారు. నిజానికి కేంద్రాన్ని ధిక్కరించి ఏపీ సొంత కాళ్లపై నిలబడుతున్నప్పుడు మోడీ ఎక్కడికి వస్తే... చంద్రబాబుకు ఎందుకు? పైగా నరేంద్ర మోడీని బాబు స్వయంగా ఆహ్వానించి.. ఇదిగో చూడు.. నువ్వు మాకు సాయం చేయకపోయినా.. మేం కష్టపడి సాధించుకున్నాం.. ఇదీ తెలుగోడి సత్తా! అనే రేంజ్లో మోడీకి దిమ్మతిరిగేలా చేసే అవకాశం ఉంది కదా!
ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. కానీ, చంద్రబాబుకు ఈ ఆలోచన లేకుండా అపరచాణిక్యుడు అయిన చంద్రబాబుకు రాజకీయాలు నేర్పాల్సిన అవసరం ఏముంటుంది? అయినా కూడా చంద్రబాబు ఎందుకు భయ పడుతున్నారు? మోడీ వస్తే.. నల్ల జెండాలు చూపించాలని, ఆయన కు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని చంద్రబాబు ఎందుకు పిలుపు నిస్తున్నారో తెలియక చాలా మంది తికమక పడుతున్నారు. అయితే, ఈ విషయంలో నిశితంగా పరిశీలిస్తే.. మోడీని రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయొద్దనడానికి తన వైఫల్యాలే చంద్రబాబుకు కారణంగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
ప్రత్యే కహోదా వద్దన్నది చంద్రబాబే! ఇదే విషయాన్ని మోడీ చెప్పడని గ్యారెంటీ లేదు. ముందు హోదా వద్దని, తర్వాత ప్యాకేజీ ముద్దు అన్నాడు. ఇక, పోయి పోయి శత్రువు వంటి కాంగ్రెస్తో చేతలు కలిపారు. మరి ఇలాంటి విషయాలను మోడీ విడిచి పెట్టరు కాబట్టే.. ఎన్నికల వేళ తన పరువు పోతుందని, ఏపీలో చులకన అవుతామని భావించిన చంద్రబాబు... మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏదేమైనా.. చంద్రబాబులో భయం మాత్రం తొంగి చూస్తోందనడంలో సందేహం లేదు.