జైలుకు చంద్రబాబు..? ఏపీలో రాష్ట్రపతి పాలన..? జరిగే పనేనా..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం చంద్రబాబు జైలుకు వెళ్తారా.. ఏపీలో ఆయన సర్కారు పతనమై రాష్ట్రపతి పాలన వస్తుందా.. నిజంగా ఇవి జరిగే పనులేనా.. అవునంటున్నారు బీజేపీ నేతలు. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకుంటున్న నేపథ్యంలో జీవీఎల్ ఈ కామెంట్స్ చేశారు.



ఆంధ్రప్రదేశ్‌ లో రాష్ట్రపతి పాలన కావాలనుకుంటే.. ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకోవచ్చని ఆయన టీడీపీ నేతలకు సలహా ఇచ్చారు. టీడీపీ నేతలు ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జీవీఎల్ హెచ్చరించారు. కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకోవడం తప్ప చంద్రబాబు సర్కారు చేసిందేమీ లేదన్నారాయన.



అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని జీవీఎల్ అంటున్నారు. ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధి కాకుండా టీడీపీ ప్రభుత్వం చేసిన కనీసం మూడు పనులు చెప్పాలని సవాల్‌ విసిరారు. గృహనిర్మాణంలో అంతులేని అవినీతికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు.



ఐతే.. ఈ జీవీఎల్ నరసింహారావు మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ నేతల అవినీతి గుట్టు విప్పుతామని ఆయన గత ఆరునెలలుగా ఇదే పాట పాడుతున్నా.. అలాంటి చర్యలేమీ కేంద్రం నుంచి కనిపించడం లేదు. ఇక ఎన్నికలు దగ్గరకొచ్చిన నేపథ్యంలో అలాంటి సంచలన నిర్ణయాలకూ ఆస్కారం తక్కువే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: