రాష్ట్రంలో రాజకీయాలు వడివడిగా మారుతున్నాయి. ఏ పార్టీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.? ఎప్పుడు ఏ నేత ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో? ఏ పార్టీలోకి నేతలు మారిపోతారో ఊహించలేని పరిస్థితులు రాష్ట్రంలో రాజ్యమేలు తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రధాన, ఏకైక విపక్షం వైసీపీ ఎలా దూసుకుపోవాలి? ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా క్యాష్ చేసుకోవాలి? అనే పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి. అధికార పార్టీ టీడీపీ ఒక వైపు వాయు వేగంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, వరాల జల్లులతో ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు వారిని తడిపి ముద్ద చేస్తోంది.
అదేసమయంలో మరో పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా రాజకీయాలు చేస్తున్నారు. వచ్చినవారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ సమయంలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్ మరింత వేగంతో ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. దీనికి సంబంధించి ఆయన కీలక నాయకులను వినియోగించుకుంటేనే తప్ప పరిస్థితి బాగు పడే సూచనలు కూడా తెరమీదికి వస్తున్నాయి. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్కుఅధ్యక్షుడి గా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు, వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారధి వంటివారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే జగన్ మాత్రం తన సొంత నిర్ణయాలతో వీరిని పక్కన పెట్టడం వైసీపీ సాను బూతి పరులను సైతం అవాక్కయ్యే లా చేస్తోంది. కీలకమైన రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన నాయకులను బుట్టదాఖలు చేసి.. రాజకీయంగా ఎలాంటి అనుభ వం లేని విజయసాయిరెడ్డి వంటి విఫలనాయకులను, ప్రజల మధ్య లేని నేతలను తనకు కీలకంగా భావిస్తుండడం, వారినే రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా నియమించుకోవడం వంటి పరిణామాలు పార్టీని తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతు న్నాయి.
కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకులను వైసీపీ దూరం చేసుకోవడానికి విజయసాయి ఇచ్చిన నివేదికలే కారణంగా కనిపిస్తున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో చూసుకుంటే మాత్రం ఇలా దూరమైన నాయకుల వల్ల పార్టీ ఇబ్బంది పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఏరికోరి భుజాలపైకి ఎక్కించుకుంటున్న రెడ్డి వర్గం వల్లే జగన్ నాశనం అవుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇప్పుడైనా.. ఈ కీలక సమయంలోనైనా జగన్ ముఖ్య నేతలకు పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు.