దగ్గుబాటి ఫ్యామిలీ చేరికతో జగన్కు ఎంత లాభం..?
తెలుగు రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. స్వయానా ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం ఇప్పుడు వైసీపీతో చేతులు కలుపుతోంది. ఈ చేరిక ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది.. దీని వల్ల ఎవరికి నష్టం. ఎవరికి లాభం అన్న చర్చ మొదలైంది.
దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరడం జగన్కు చాలావరకూ లాభం చేకూరుస్తుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన రాజకీయ కుటుంబం వైసీపీలో చేరడం ఆ పార్టీ సెంటిమెంట్ను బలపరుస్తుంది. ఏపీలో జగన్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయన్న సంకేతాలను జనంలోకి తీసుకువెళ్తుంది.
ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో వైసీపీ పుంజుకునేందుకు ఈ చేరిక ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి వైసీపీలో చేరడం జగన్ కు ఆ సామాజిక వర్గం నుంచి కూడా మద్దతు ఉన్నట్టవుతుంది. ఐతే.. ఇది జగన్ కు చెప్పుకునేందుకు.. చూసేవారికి కీలకమైన మార్పుగా కనిపించినా దీనివల్ల చంద్రబాబుకు పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చు.
ఎందుకంటే దశాబ్దాలుగా దగ్గుబాటి కుటుంబం చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉంటోంది. చంద్రబాబను వ్యతిరేకించే పార్టీల్లోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం ఉంటోంది. అందువల్ల ఈ చేరికతో టీడీపీకి పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.