ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి పునరాగమనం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పరిస్థితి ఒకప్పటికంటే.. ఇప్పుడుఎలా ఉంది? రాజకీయాల్లో అనుభవ లేమి ఆయనను ఏం చేస్తోంది? ఆయన దుందుడుకు స్వభావం.. ఎవరిమాటనూ లెక్క చేయకుండా .. అంతా నాకే తెలుసుననే అహంభావం వంటివి ఆయనను ఏం చేస్తున్నాయి? ఎన్నికలకు ముంగిట జనసేన పార్టీ వేస్తున్న పిల్లి మొగ్గలు ఎలా ఉన్నాయి? వంటి కీలక అంశాలపై చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి వచ్చ ఎన్నికల్లో ఏపీలో చక్రం తిప్పాలని జనసేనాని అనుకున్నారు. ముఖ్యంగా కొన్నాళ్లపాటు చంద్రబాబును అనుసరించిన ఆయన .. తర్వాత బాబుతో విభేదించారు.
వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీకి దిగాలని భావించారు. అయితే, ఇదంత ఈజీ కాదని తెలుసుకునే సరికి జరగాల్సి న నష్టం జరిగిపోయింది. ఏ ఒక్క జిల్లాలోనూ పూర్తిగా ఆయన పుంజుకోలేక పోయారు. పార్టీ కేడర్ కూడా ఎక్కడా పూర్తిగా ఏర్పడలేదు. ఇంతలోనే ఎన్నికల కోడ్ కూడా వచ్చేస్తోంది. మరో పక్క, అత్యంత ఆసక్తికర విషయం ఏంటంటే.. రాష్ట్రంలో సీఎం అయ్యే అర్హత కానిస్టేబుల్ కుమారుడిగా తనకు లేదా అంటూ.. రాజమండ్రిలో కవాతు నిర్వహించిన సందర్భంగా పవన్ చేసిన ఆవేశ పూరిత ప్రసంగం పూర్తిగా చప్పబడిపోయింది. గడిచిన జనవరి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ఆయన వాయిస్ వినిపించడం లేదు.
అంతేకాదు, మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. జనసేన అధినేతగా ఇప్పటి వరకు అనేక జిల్లాలు తిరిగాడని పవన్ అభిమానులు చెప్పుకొంటున్నా.. వాస్తవానికి ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు పవన్ అడుగు కూడా పెట్టలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదేసమయంలో తటస్థంగా ఉన్న నాయకులు ఆయన పార్టీలోకి ముంచెత్తుతారని, ముఖ్యంగా కాపు వర్గం ఆయనకు కొమ్ముకాస్తుందని నిన్నమొన్నటి వరకు కూడా అనేక అంచనాలు అచెంచలుగా వచ్చినా.. తీరా చూస్తే.. ఇలా అధికార పార్టీ నుంచి జంప్ చేస్తున్న కీలక నాయకులు అందరూ జగన్ గూటికి చేరుతున్నారు.
పోనీ.. చచ్చు పచ్చు నాయకులు అనబడే వారు కూడా జనసేనాని గూటికి చేరేందుకుఇష్ట పడడం లేదు. ఇక, యువత కూడా అభిమానిగా పవన్ను కొలుస్తున్నా.. పార్టీ పరంగా గతంలో ఉన్న ఊపును ఇప్పుడు చూపించలేక పోతున్నారు. ఏతావాతా.. ఎలా చూసినా.. ఎన్నికలకు సమయం ముంచుకు వస్తున్న నేపథ్యంలో జనసేనానికి జనం లేకుండా పోవడం.. సేన కనిపించకపోవడం వంటివి చాలా మైనస్గా మారాయి. ఎన్నికల్లో ఈయన మరో కుమారస్వామి అవుతారేమోనని అంటున్నారు పరిశీలకులు.