ఉగ్రవాదులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాం..ధ్రువీకరించిన భారత్!
పుల్వామాలో సైనిక బలగాలపై దాడికి పాల్పడ్డ జైషే మహ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నట్లు భారతదేశ విదేశాంగ శాఖ కార్యదర్శి గోఖలే తెలిపారు. ఆయన ఢిల్లీలో దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు. పాకిస్థాన్ కేంద్రంగా జైషే మహ్మద్ రెండేళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తోంది. బహావల్పూర్ నుంచి వరుసగా ఉగ్రదాడులకు పాల్పడుతోంది.
భారత్లోని పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేపట్టేందుకు జైషే మహ్మద్ యత్నిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. ఇందుకోసం ఫిదాయిన్ జిహాదీలకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. పుల్వామా దాడి తర్వాత, అంతకు ముందు కూడా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్థాన్ కు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. దాంతో ఉగ్రవాదులకు గట్టిగా బదులిచ్చేందుకే ఈ రోజు తెల్లవారుజామున నిఘా వర్గాల నేతృత్వంలో ఆపరేషన్ చేపట్టాం. జైషే మహ్మద్కు చెందిన అతిపెద్ద ఉగ్ర శిబిరమైన బాలకోట్లో దాడి చేశాం.
ఈ ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు, జిహాదీలను మట్టుబెట్టాం. భారత్ చేసిన వైమానిక దాడుల్లో ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. బాలాకోట్ లోని జైషే మహమ్మద్ అతిపెద్ద ఉగ్రవాద క్యాంపుని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు.
పాకిస్థాన్ సహకారం లేనిదే ఉగ్రవాదులు దాడులు చేయలేరన్నారు. పీఓకేలో వందలాది ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయని ఆయన తెలిపారు.జైషే ఉగ్ర శిబిరాన్ని లక్ష్యంగా చేసకుని సైనికేతర దాడి చేపట్టినట్లు చెప్పారు. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు నిర్దేశిత లక్ష్యాలపైనే దాడి చేసినట్లు వెల్లడించారు.