నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొత్త ముఖం..! చంద్రబాబు స్ట్రాటజీ...??
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకత ఉంది. మహామహా ఉద్దండులు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి పాలించారు. ఒకప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీకి కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా పట్టు సాధించింది. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. ఆ తర్వాత వైసీపీ కూడా పైచేయి సాధించింది. గత ఎన్నికల్లో అధిక స్థానాలు వైసీపీకే దక్కాయి. అయితే ఈ దఫా సింహపురిపై పట్టు సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.
నెల్లూరు జిల్లా వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు కోసం ఇటీవల సమీక్ష జరిగింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు అధినేత చంద్రబాబు. నెల్లూరు రూరల్ నుంచి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి నుంచి బీదా మస్తాన్ రావుల పేర్లు ఖరారు అయ్యాయి. అయితే వీరిద్దరూ కూడా తొలి నుంచి ఎమ్.పి స్థానాలకు పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ అసెంబ్లీ బరిలో నిలుస్తుండడం ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం.
వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వెలగపూడి వరప్రసాద్ మరోసారి బరిలోకి దిగబోతున్నారు. టీడీపీలో ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థులు ఎవరనేది తేలలేదు. ఎంపీ స్థానాలకు పోటీ చేసే స్థాయి ఉన్న నాయకులు టీడీపీలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే ఇప్పుడు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. నెల్లూరుపై మంచి పట్టున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావించారు. అయితే ఒంగోలు నుంచే బరిలోకి దిగేందుకు మాగుంట ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అక్కడ కూడా పార్టీ అధిష్టానం తాను చెప్పిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోవడంతో వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు బరిలో ఎవరు నిలుస్తారనేది ఆసక్తిగా మారింది.
అయితే.. చంద్రబాబు వ్యూహాత్మకంగానే నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని ఖరారు చేయలేదనే వార్తలూ వినిపిస్తున్నాయి. తెరపైకి ఓ సరికొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకే ముందుగా అనుకున్నఇద్దరు అభ్యర్థులను అసెంబ్లీకి పంపిస్తున్నారని పార్టీలో ప్రచారం జరిగుతోంది. ఒకవేళ జనసేనతో పొత్తు ఖరారైతే ఈ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయిస్తారనే ప్రచారమూ లేకపోలేదు..!