ఇది నిజంగా షాకింగ్ డెసిషనే. ఏపీలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా వూహించలేదు. ఎందుకంటే ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలు అన్నీ ఏప్రిల్ నెలాఖరు, మే మొదటి వారంలోనే. అందువల్ల ఎన్నికల షెడ్యూల్ మామూలుగా రిలీజ్ ఉంటుంది. ఏపీ వరకూ కచ్చితంగా యాభై రోజుల వరకూ వ్యవధి ఉంటుందని అన్ని పార్టీలు భావించాయి. ఇపుడు చూడబోతే షాక్ ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ఏకంగా నడి వాకిట్లోకి తెచ్చేసింది.
అభ్యర్ధులు అలాగే :
ఏపీలో అధికారంలోకి వద్దామనుకుంటున్న వైసీపీ, మరో మారు అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్న టీడీపీ రెండు పార్టీలు కూడా పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధం కాలేదు. వంద వరకూ సీట్లలో వైసీపీ, అంతే జాబితాతో టీడీపీ ఇపుడు రెడీగా ఉన్నాయి. అలాగే పదిహేను వరకూ ఎంపీ సీట్లలో రెండు పార్టీలకు క్లారిటీ వచ్చింది. అంటే సగానికి సగం ఎంపికల కసరత్తు ఇంకా ఏ పార్టీ పూర్తి చేయలేదు. ఇంతలో తోసుకుంటూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. . మరి ఎలా పరుగులు పెడతారో
వారంలో నామినేషన్లు :
వారం రోజుల్లో నామినేషన్ల ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 18 నుంచి 25 వరకూ స్వీకరణ, ఆ తరువాత పరిశీలన. ఈ నెల 28 లోగా విత్ డ్రాయల్స్ ఇలా షెడ్యూల్ ఉంది. ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓ వైపు తొందరగా అభ్యర్ధులను ఎంపిక చేసుకుని వారిని ప్రచారంలోకి దింపి పార్టీ రధ సారధులు యమ స్పీడ్ మీద రోడ్డెక్కాలి. అప్పటికి మిగిలి ఉండేది కచ్చితంగా పదిహేను రోజులు మాత్రమే. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటి నుంచి ప్రతి నిముషమూ విలువైనదే. ప్రతి అవకాశమూ బంగారమే. మరి వైసీపీ, టీడీపీ ఈ సమస్యను ఎలా అధిగమించి ముందుకు దూకుతాయో చూడాల్సిందే.