మంత్రి దేవినేని ఉమా.. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాయకుడుగా గుర్తింపు సాధించారు. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన నాయకుడు. కమ్మవర్గానికి చెందిన నేత కావడంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మారారు. గత ఎన్నికల్లో ఏర్పడిన బాబు కేబినెట్లో రాష్ట్ర జలవనరుల మంత్రిగా బెర్త్ను సా ధించిన మంత్రి ఉమా.. కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా చంద్రబాబు దృష్టిలో మంచి మార్కులు వేసుకున్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల కోసం అహరహం శ్రమించారు. అయితే, అదేసమయంలో ఆయన చంద్రబాబు వద్ద, కొన్ని జిల్లాల్లో రైతుల వద్ద మంచి పేరు సంపాయించుకున్నా.. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల విషయానికి వచ్చేసరికి మాత్రం వెనుకబడ్డారు.
నియోజకవర్గానికి చాలా దూరమయ్యారు. ఏదో చుట్టపు చూపుగా రావడం పోవడం మినహా ఇక్కడ సమస్యలను పట్టించుకో లేదనే ప్రచారం ఉంది. అదేసమయంలో తనకు పార్టీ పరంగా అన్నీ అయి గెలిపించిన కార్యకర్తలను కూడా ఉమా పట్టిం చుకోలేదు. దీంతో పార్టీలోనూ ఉమాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ఉమా హ్యాట్రిక్ దిశగా అడుగులు వేయాలని చూస్తున్నా.. ప్రత్యర్థి శిబిరం నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అదేసమయంలో.. సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత, అసంతృప్తి దేవినేనికి దడ పుట్టిస్తున్నాయి. నిజానికి ఎన్నికలలో ఆయన విజయం సునాయాసమే అయి ఉండేది. అయితే, స్వయంకృతం ఆయనను వెంటాడుతోందని అంటున్నారు.
ఇక, వైసీపీ అభ్యర్థివిషయానికి వస్తే.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడ నుంచి వైసీపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. దాదాపు ఏడాది కిందటి నుంచే ఇక్కడ కృష్ణప్రసాద్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల మధ్యే ఉంటూ... వారిని సమీకరిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటికి అనుగుణంగా లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. ఉపాధి, ఉద్యోగాలు, పారిశ్రామికీకరణ, సాగు నీరు వంటి కీలక అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్న వసంత తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రజలను తాను నమ్మించడం అనే ప్రక్రియను దేవినేని అవలంబిస్తే.. ప్రజలే తనను నమ్మే పరిస్థితిని అవలంబించేలా చేయడం వసంత అనుసరిస్తున్న విధానం. మొత్తానికి ఈపరిణామం తనను ఎక్కడ పుట్టిముంచుతుందోనని దేవినేని హడలి పోతున్నట్టు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.