కడప జిల్లా పొట్లదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కీలక నేత సీఎం రమేశ్ ఇంటిలో సోదాలు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే సీఎం రమేశ్ సెర్చ్ వారంట్ ఉందా అని నిలదీయడంతో వారు వెనుదిరిగినట్టు తెలుస్తోంది.
దీంతో .. సీఎం రమేశ్ అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాలో టీడీపీలో సీఎం రమేశ్ చాలా కీలకనేత.. ఆయన జిల్లాలో మనీ మేనేజ్మెంట్ అంతా సీఎం రమేశ్ చేతుల్లోనే ఉంటుందని చెబుతుంటారు. ఈ సమయంలో ఆయన్ను టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.
మొన్నటికి మొన్న మరో టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లోనూ దాడులు జరిగాయి. ఆ సమయంలో సీఎం రమేశ్ ఐటీ అధికారులపై రెచ్చిపోయారు. ఏం దొరికాయి చూపించండి అంటూ నిలదీశారు. తాజాగా ఆయన ఇంటిపైనే సోదాలకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది.
ఇదంతా వైసీపీ కేంద్రంలోని పెద్దలతో కుమ్మక్కవడం వల్లే జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం.. ఐటీ దాడులు, పోలీసుల సోదాలు తమ పార్టీనేతలపైనా గతంలో చాలా జరిగాయని.. తాము సహకరించామని.. ఇలా యాగీ చేయలేదని చెబుతున్నారు.