మార్పు కోసం ఓటేయమన్న జగన్ !!
వైసీపీ అధినేత జగన్ తన ఓటు హక్కుని సతీ సమేతంగా వెళ్ళి ఉపయోగించుకున్నారు. భార్య భారతితో కలసి జగన్ పులివేందులల్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా అక్కడ పోలింగ్ బూత్ లో సందడి నెలకొంది. జగన్ తో సెల్ఫీలు దిగేందుకు పోలింగ్ సిబ్భంది ఆసక్తి చూపారు. ఓటర్లు సైతం జగన్ని చూసేందుకు ముందుకు వచ్చారు. జగన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఇదిలా ఉండగా మీడియాతో మాట్లాడిన జగన్ ఈసారి ఏపీలో గొప్ప మార్పునకు నాంది ఈ ఎన్నికలు అన్నారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఓటు వేసి తమ హక్కును, బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలని జగన్ కోరారు. సమాజంలో మార్పు రావాలంటే ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. నిర్భయంగా ఓటు వేయాలని, మార్పు కోసం ఓటు వేయాలని జగన్ అన్నారు. ఏపీ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, దేవుని దయవల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాని చెప్పారు.
కాగా జగన్ తల్లి విజయమ్మ కూడా పులివెందులలో ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. ఆమె సైతం విలేకలతో మాట్లాడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు చేయడం మంచి పరిణామని చెప్పారు. ఇవి కీలకమైన ఎన్నికలని ఆమె అన్నారు.