రాజకీయ ఖిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురం జిల్లాలో టీడీపీకి మంచి పట్టుంది. హిందూపురం ఎమ్మెల్యే సహా హిందూ పురం ఎంపీ స్థానాల నుంచి అనంతపురం ఎంపీ స్థానం, అనంతపురం పట్టణ నియోజకవర్గం వరకు కూడా టీడీపీ హవా గత ఎన్నికల్లో జగజ్జేయమానంగా వెలిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ ఏరకంగా దూసుకుపోయింది? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. హోరా హోరీ పోరు అనంతరం ఈ నెల 11న ముగి సిన ఎన్నికల ప్రక్రియ అనేక సందేహాలను, ఉత్కంఠలను తెరమీదికి తెచ్చింది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎవరూ ఊహించనంతగా కొనసాగింది. ఈ క్రమంలో టీడీపీకి ఇది పాజిటివ్ ఓటు బ్యాంకు అని చంద్రబాబు చెబుతున్నారు.
అయితే, అత్యధికంగా పోలైన ఓట్లన్నీ కూడా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతే అని విపక్షం వైసీపీ చెబుతోంది. ఈ నేప థ్యంలో ప్రతి జిల్లాలోనూ ఫలితంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అనంతపురం విషయానికి వస్తే.. 14 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో రెండు చోట్ల మాత్రమే ఇక్కడ వైసీపీ విజయం సాదించింది. ఇక, రెండు ఎంపీ స్థానాలనూ టీడీపీనే కైవసం చేసు కుంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే.. వైసీపీ గెలిచిన రెండు స్థానాల్లో కదిరి ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సరే! ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల విషయానికి వస్తే.. టీడీపీ-వైసీపీల మధ్య పోరు హోరా హోరీగానే సాగింది.టీడీపీ నుంచి ఈ దఫా.. ముగ్గురు రాజకీయ వారసులు అరంగేట్రం చేశారు. అనంతపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన పవన్ కుమార్ రెడ్డి చెమటోడ్చాడనే చెప్పాలి. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన తలారి రంగయ్యకు కేటాయించడం జేసీ వర్గానికి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.
జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను దూషించడం, స్వామీజీ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం వంటి పరిణామాల నేపథ్యంలో వివాదాస్పదమయ్యారు. దీంతో ఈ కుటుంబంపై ఒకింత వ్యతిరేకగాలులు వీచాయి. ఇక, తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన జేసీ అస్మిత్ రెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని గ్రౌండ్ రిపోర్టు చెబుతోంది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దిరెడ్డి నిలబడ్డారు. ఇక, రాప్తాడు నుంచి యువనాయకుడు, మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రంగంలోకి దిగారు. ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రం టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆది నుంచి అంచనాలు ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. మరోపక్క, వైసీపీ పుంజుకోవడం గమనార్హం.
చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలు రక్షిస్తాయని భావించినా .. చివరి నిముషంలో ప్రజల నాడి మారినట్టు ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఈక్రమంలోనే తాడిపత్రిలోని రెండు బూత్లలో మారణ హోమానికి దారితీసినట్టు పోలీసులు గుర్తించారు. ఇక జిల్లాలో నియోజకవర్గాల వారీగా చూస్తే చెరి 7 సీట్లు వస్తాయన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. పోలింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే వైసీపీకి రాయదుర్గం, గుంతకల్లు, శింగనమల, అనంతపురం టౌన్, పుట్టపర్తి, ధర్మవరం కూడా వైసీపీకే ఉన్నాయి. కదిరిలో హోరాహోరీ ఉన్నా స్వల్ప ఎడ్జ్లో ఉంటామన్న ఆశతో వైసీపీ ఉంది. ఇక టీడీపీకి ఉరవకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాఫ్తాడు, మడకశిర, హిందూపూర్, పెనుగొండ దక్కనున్నాయి.