ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో 40 రోజుల సమయం ఉండడంతో వైసీపీ శిబిరంలో ఎక్కడ చూసినా ఒక్కటే జోష్ నెలకొంది. జగన్ పార్టీ నేతలు, శ్రేణుల అప్పుడే సంబరాలు స్టార్ట్ చేసేశారు. ఇటీవల వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ను కలిసిన సందర్భంలో వైసీపీకి 117 సీట్లు వస్తాయని చెప్పడం జగన్ సైతం ప్రశాంత్ కిషోర్ టీంను అభినందించడం జరిగాయి. ప్రశాంత్ కిషోర్ టీం జగన్ను కలిసినప్పుడు అక్కడ ఉన్నవారు సీఎం సీఎం అంటూ నినాదాలు చెయ్యడం జగన్ వెంటనే చిరు మందహాసం చెయ్యడం ఆ వీడియో వైరల్గా మారిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఎక్కడా చూసినా తెలుగు మీడియాలో ఏపీకి కాబోయే సీఎం జగన్ అన్న నినాదం బాగా వైరెల్ అవుతోంది. ఇక ఎన్నికల పోలింగ్ తర్వాత వైసీపీ శిబిరంలో నెలకొన్న జోష్ ఆకాశాన్ని అంటింది. అదే టైమ్లో టీడీపీ శ్రేణులు ఒకింత డీలా పడ్డాయి. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తీవ్ర అసహనానికి గురవుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో ఉన్న నేమ్ ప్లేట్లు అప్పుడే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. గౌరవనీయులైన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ రాసున్న ఈ నేమ్ ప్లేట్లు ఈ సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతున్నాయి. ఈ నేమ్ ప్లేట్ ఫొటోలను వైసీపీ సానుభూతి పరులు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా కాబోయే సీఎం జగనే అంటూ ప్రచారం జోరందుకుంది. పార్టీ పెట్టిన నాలుగేళ్లలోనే 67 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్ష నేతగా రికార్డులకు ఎక్కిన జగన్ తక్కువ వయస్సులో, తక్కువ టైమ్లో ఓ రాష్ట్రానికి ముఖ్య మంత్రి అవ్వడం అంటే మామూలు విషయం కాదు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ మోహన్ రెడ్డి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ రోజు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబును గద్ది దింపే వరకు వచ్చారు.
ప్రతిపక్ష నేతగా తక్కువ వయస్సులోనే జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారిన జగన్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాడని జాతీయ మీడియా వన్ సైడ్గా చెబుతోంది. ఎన్నికల గాలి కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఏపీలో మెజారిటీ సామాజికవర్గాలు, మధ్య తరగతి, పేదలు ఈ సారి జగన్కు ఓ అవకాశం ఇచ్చి చూద్దాం అన్న భావనతోనే ఫ్యాన్కు ఓటు వేశారు. ఇక జగన్ సైతం ఓ అవకాశం ఇచ్చి చూడండి అని అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం కూడా కలిసివచ్చింది. అందుకే జగన్ ప్రమాణస్వీకారం అయిన వైఎస్ జగన్ అనే నేను అనే ట్యాగ్ లైన్లు, వాయస్ ఓవర్లు ఇప్పుడు ఇటు సోషల్ మీడియాలోనూ అటు వైసీపీ శ్రేణుల ఫోన్ల రింగ్ టోన్లుగానూ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ జగన్ను కలిసిన వెంటనే ఆలింగనం చేసుకోవడంతో పాటు సీఎం అని చెప్పారు. ఇదే క్రమంలో రేపు ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సైతం ఎలా ముందుకు వెళ్లాలి ఇతరత్రా అంశాలపై సైతం వీరిద్దరూ ప్రాథమికంగా చర్చించుకున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఏపీ సీఎం జగన్ అన్న హడావుడి అయితే మొదలైపోయింది. ఇక తుది ఫలితాల కోసం వెయిట్ చెయ్యడమే మిగిలి ఉంది.