ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక సంక్షోభం మొదలైందా? సాక్షాత్తు కీలక ప్రజాసంక్షేమ శాఖలోనే చెక్కులు ఎందుకు బౌన్స్ అవుతున్నాయి? నిధుల లేమి వల్ల ఖజానా డొల్లగా మారడమే దీనికి కారణమా? ఈ చర్చ ప్రస్తుతం రాజకీయ, అధికార వర్గాల్లో జరుగుతోంది. ఇందుకు కారణం ఏపీలో సీఎం రిలీఫ్ పండ్ కింది ఇచ్చిన చెక్ బౌన్స్ అవటం. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లబ్ది పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను సైతం పక్క దారి పట్టించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.
కర్నూలు జిల్లా, పాణ్యం నియోజక వర్గం, నాగిరెడ్డి కాలనీకి చెందిన గంగాధర రెడ్డి ఇలా ప్రభుత్వ చెక్ బౌన్స్ ఉదంతంతో షాక్ తిన్నారు. గంగాధరరెడ్డి భార్య జ్యోతికి అనారోగ్యం కారణంగా 2018 నవంబర్ లో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్కు ఆరోగ్యశ్రీ సదుపాయం లేకపోవటంతో రూ. 56 వేల రూపాయలు అప్పుచేసి ఆపరేషన్ చేయించారు. ప్రభుత్వ సహాయం కోసం పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ఏరాసు ప్రతాప రెడ్డి ద్వారా నవంబర్ 26న సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లయ్ చేశారు. అందుకు సంబంధించి 2019 మార్చి 15న రూ.26,920 లు మంజూరు చేసినట్లు సమాచారం వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కును, ఏపీలో పోలింగ్ కు 2 రోజుల ముందు ఏప్రిల్ 9వ తేదీన ఏరాసు ప్రతాప రెడ్డి బాధిత కుటుంబానికి అందచేశారు.
ప్రభుత్వం తరఫున ఇచ్చిన చెక్ను ఈ నెల 10వ తేదీ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అయితే, 15 వ తేదీని బ్యాంకు అధికారులు సంచలన సమాచారం ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలో నిధులు లేవని లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. దీంతో షాక్ తినడం గంగాధర్ రెడ్డి వంతు అయింది. ``అప్పుచేసి ఆపరేషన్ చేయించాం. సీఎం రిలీఫ్ పండ్ ద్వారా వచ్చేదానితో కొంత మేర అప్పు తీర్చవచ్చనుకున్నాము. నిధులు లేకపోవటంతో ఏంచేయాలో అర్ధం కావటంలేదు`` అని గంగాధర్ రెడ్డి మీడియాతో వాపోయారు.