మరోమారు భారతదేశంలో బాంబుల కలకలం రేగింది. అసోం రాజధాని గువాహటిలోని షాపింగ్ మాల్ వద్ద ఈ సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను గువాహటి వైద్యకళాశాలకు తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేలుడు సంభవించిన జూ రోడ్డు ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పేలుడు తర్వాత సంఘటనా స్థలం దగ్గర పోలీసులు రాకపోకలు నిలిపేశారు.
రాత్రి 8 గంటలకు జూ రోడ్ లో ఉన్న గువాహటీ సెంట్రల్ మాల్ బయట గ్రనేడ్ పేలుడు జరిపిన పేలుడుకు పాల్పడింది తామేనని పరేశ్ బర్హా నేతృత్వంలోని నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉల్ఫా తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దర్యాప్తు కొనసాగుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ తెలిపారు. ఈ పేలుడు వెనక కారకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సొనోవాల్ డీజీపీని ఆదేశించారు.