తెలంగాణలో కారు స్పీడ్కు బ్రేకులు పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి నడుస్తున్న టీఆర్ఎస్ వన్సైడ్ వార్ కు తెరపడింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన లోక్సభ ఫలితాల్లో టీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్, బీజేపీలు గట్టి పోటీనిచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కుమార్తే, నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దాదాపు 68 వేల ఓట్ల మెజార్టీతో కవితపై గెలుపొందారు.
2014లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంటరైన కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా 2019 ఎలక్షన్స్లో పోటీ చేసి ఓటమిని చవి చూశారు కవిత. బీజేపీ తరఫున పోటీ చేసిన ధర్మపురి అరవింద్ దాదాపు 68 వేల ఓట్ల మెజార్టీతో కవితపై గెలిచారు.
ఈ సారి కవితకు పసుపు, ఎర్రజొన్న రైతుల సెగ తగిలింది. పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నకు మద్దతు ధరపై పోరులో భాగంగా.. 176మందికి పైగా రైతులు ఆమెపై పోటీకి దిగగా.. దెబ్బకు పోలింగ్ కాస్త వాయిదా పడింది. దీంతో బ్యాలెట్ పద్దతిలో ఎన్నిక నిర్వహిస్తారని అందరు భావించారు. కానీ ఈసీ మాత్రం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి.. ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించింది. కవిత ఓటమితో కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది.