కాంగ్రెస్, జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరిన కర్ణాటక రాష్ట్రంలో అధికార పార్టీకి కోలుకోలేని షాక్ కు గురి చేశాయి. 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. ఇక్కడ బీజేపీకి అనుకోని రీతిలో సీట్లు దక్కాయి. ఇది ఊహించని పరిణామం. మోదీ అండ్ టీం యాక్షన్ ప్లాన్ వర్కవుట్ అయింది. లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో 28 సీట్లకు ఎన్నికలు జరిగాయి. దిగ్గజ నేతలు ఎన్నికల బరిలో నిలిచారు. కుమారస్వామి, రాహుల్ గాంధీ, చంద్రబాబు, మమతా బెనర్జీ, దేవగౌడలు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఎందుకనో ప్రజలు వీరిని విశ్వసించలేదు. అధికార పార్టీకి జై కొట్టలేదు.
మొత్తం సీట్లలో 95 శాతానికి మించి భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించింది. ఏకంగా 25 సీట్లను చేజిక్కించుకుని అధికార పార్టీకి కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేస్తే 2 సీట్లు మాత్రమే గెలుచు కోగలిగాయి. పోలింగ్ సరళి చూస్తే..పోలైన ఓట్ల శాతం ఈ విధంగా ఉంది. బీజేపీకి అత్యధికంగా 51.38 శాతం పోలింగ్ నమోదైంది. బీఎస్పీకి 1.1 శాతం, సీపీఐకి 0.05 , సీపీఎంకు 0.05 శాతం, ఐఎన్సీకి 31.88 , జేడీఎస్ కు 9.67 , నోటాకు 71 , ఎస్ హెచ్ ఎస్ 0.04 శాతం సాధిస్తే ఇతరులు 5.04 ఓట్లను కొల్లగొట్టారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్కు అనూహ్యమైన పరాజయం ఇది. కోలుకోలేని దెబ్బ ఇది. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన దేవగౌడ పాచికలు, వ్యూహాలు ఈసారి పారలేదు. ఉక్కు సంకల్పంతో ముందుకెళుతున్న మోదీ ముందు అవి ఏ మాత్రం పని చేయలేదనే చెప్పాలి. పక్కా ప్లాన్తో జనాన్ని సమీకరించడంలో, ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇక ఇరు పార్టీలు అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కోరి కోరి ఓటమిని కొని తెచ్చుకున్నారు. ఇప్పటికైనా మేలుకోక పోతే ..జేడీఎస్..కాంగ్రెస్ పార్టీలకు కష్ట కాలమే.