రాజకీయాలకు-నేరస్తులకు మధ్య అవినాభావ సంబంధం ఎక్కువగా ఉంటోందని కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట. నిజమే.. మనం ఇప్పుడు నెహ్రూ కాలంలోనో.. పుచ్చలపల్లి సుందరయ్య కాలంలోనో లేము కదా?! ముఖ్యంగా ఎన్నికలు ఖరీదై పోయిన నేపథ్యంలో నేరస్తులకు కూడా చోటు కల్పించాల్సి రావడం పార్టీలకు కూడా తప్పని పరిస్థితిగా మారిపో యింది. తాను నీతిమంతుడినని, తన ప్రభుత్వం రూపాయి అవినీతి కూడా చేయలేదని చెప్పుకొనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే భారీ ఎత్తున నేర చరితులు ఉన్నారు. అంతెందుకు కొంత నిష్టూరంగా ఉన్నా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కూడా క్రిమినల్ కేసులు నిన్న మొన్నటి వరకు ఉన్నాయి.
ముఖ్యంగా గ్యాంగ్స్టర్ సొహ్రాబుద్ధీన్ షేక్ ఫేక్ ఎన్కౌంటర్లో షా హస్తం ఉందని అంటారు., దీనిపై ఉన్న కేసులో షాను తప్పిస్తూ.. ఏడాది కిందట ఓ కోర్టు తీర్పు చెప్పింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, మమతాకు చెందిన పార్టీలో కూడా నేరస్తులు కోకొల్లలు. ఇలా ప్రతి పార్టీలోనూ ఉన్నారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. గత చంద్రబాబు ప్రభుత్వంలోనూ ప్రస్తుతం ఇంకా ప్రమాణం చేయని వైఎస్ జగన్ బృందంలోనూ నేరచరితులు ఎక్కువగానే ఉన్నారని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 50 మంది (33 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయని తాజాగా సర్వే ను బయట పెట్టిన..తో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ నివేదికలోపేర్కొంది.
అదే టీడీపీ విషయానికి వస్తే... 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో సీరియస్ క్రిమినల్ కేసులున్న వారు నలుగురు మాత్రమేనట. అంటే.. 17 శాతం అన్న మాట. ఇక జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా సీరియస్ క్రిమినల్ కేసులున్న వ్యక్తేనట. ఇక ఆస్తిపాస్లు విషయానికి వస్తే... మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 161 మంది కోటీశ్వరులేనట. ఈ విషయంలో ఎమ్మెల్యేల యావరేజీ ఆస్తి రూ.27.87 కోట్లు ఉంటే... టీడీపీ ఎమ్మెల్యేల యావరేజీ రూ.64.61 కోట్లు కాగా - వైసీపీ యావరేజీ రూ.22.41 కోట్లుగా ఉందట. ఇక ఆస్తుల విషయంలో చంద్రబాబు రూ.668 కోట్లతో టాప్ లో నిలిస్తే... రూ.510 కోట్లతో జగన్ రెండో స్థానంలో - రూ.274 కోట్లతో నందమూరి బాలకృష్ణ మూడో స్థానంలో ఉన్నారట. మొత్తానికీ ఇది మన అసెంబ్లీ సంగతి.