ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో దఫా ఆ బాధ్యతలను చేపట్టేందుకు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలు మరియు రాష్ట్రాల అధినేతలు విచ్చేస్తున్నారు. అయితే, వీరికంటే ముఖ్యంగా మరికొందరు వీఐపీ గెస్ట్లు విచ్చేస్తున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్లో హతులైన 50 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలను ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించాలని మోదీ , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మధ్య సుదీర్ఘంగా.. 5 గంటలపాటు జరిగిన సమావేశంలో నిర్ణయించారు.
ఈ 50 మందిని ఆహ్వానించడం వెనుక అనేక ఆసక్తికర కారణాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో గత ఆరేళ్లలో జరిగిన పంచాయతీ, లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలు హతులయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే వీరిని పొట్టన బెట్టుకున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం అమిత్ షా.. హతులైన పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో కొన్నింటిని పరామర్శించారు. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా వారిని ఢిల్లీని పిలిచారు. వీరు ఢిల్లీలో బీజేపీ నేతల ‘ సంరక్షణ ‘ లో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఆహ్వానితుల జాబితా సిధ్ధమైందని, దీన్ని రాష్ట్రపతి భవన్ కు అందజేస్తామని ఈ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఈ కుటుంబాలను ఆహ్వానించాలని మోదీ తీసుకున్న నిర్ణయం వెనుక పార్టీ పరమైనవే కాకుండా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. బెంగాల్ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజకీయంగా ఎదుర్కోవడంలో ఇదో ఎత్తుగడ అంటున్నారు. బెంగాల్ లో మరో రెండేళ్ళలో.. 2021 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందే దీదీని దెబ్బ తీయాలంటే ఇలాంటి ‘ నిర్ణయాలు ‘ చాలా ముఖ్యమని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో కూడా పలువురు బీజేపీ కార్యకర్తలు టీఎంసి శ్రేణులతో జరిగిన ఘర్షణల్లో మరణించారు. ఈ ఎన్నికల్లో కమలనాథులు గతంతో (2014) తో పోలిస్తే రెండు సీట్ల నుంచి 18 సీట్లను గెలుచుకోవడం, అధికార టీఎంసీ సీట్లు 34 నుంచి 22 కు పడిపోవడం పొలిటికల్ గా బీజేపీకి బాగా కలిసివచ్ఛే అంశం. అటు-టీఎంసి నుంచి సుమారు 60 మంది బీజేపీ శిబిరంలో జంప్ చేయడానికి రెడీ అయ్యారు. వీరిలో చాలామంది అప్పుడే ఆ పార్టీ తీర్థం పుచ్ఛుకున్నారు కూడా. .. దీంతో పశ్చిమ బెంగాల్ లో మమత పట్టు మరింత దిగజారుతుందని కమలనాథులు సంబరపడుతున్నారు. కాగా, దీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు ఏడువేల మంది హాజరవుతున్నారు.