అంతా మీరే చేశారు.. బాబుగారిపై దుమ్మెత్తి పోస్తున్న తమ్ముళ్లు..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అందుకు కారణాలు వెదుకుతోంది. ఇన్నాళ్లు అధినేత నోటికి భయపడిన తమ్ముళ్లు పార్టీ పరాజయంతో కాస్త నోరు తెరిచి మాట్లాడుతున్నారు. అగ్రనాయకుల వ్యవహార శైలి వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని దుమ్మెత్తిపోస్తున్నారు.
పార్టీలో జెంటిల్ మెన్ గా పేరున్న అశోక్ గజపతిరాజు.. చంద్రబాబు వేల మందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం పార్టీ కొంప ముంచిందని అన్నారు. టెలీ కాన్ఫరెన్స్ కారణంగా క్షేత్ర స్థాయి వాస్తవాలు చర్చించుకునే అవకాశం కలగలేదన్నారు. కింది స్థాయిలో అసలేం జరుగుతుందో అధినేతకు తెలియకుండా పోయింది అన్నారు.
ఇక తెలుగుదేశం పార్టీలో మానవీయ కోణం అన్నది లేకుండా పోయిందని మరో నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు. చంద్రబాబు చుట్టూ చేరిన భజన బృందం.. ఆయనను భ్రమల్లో ఉంచారని దివ్యవాణి ఆరోపించారు. చంద్రబాబు కూడా నాయకుల కంటే ఎక్కువగా అధికారులకి ప్రాధాన్యం ఇచ్చారని మరికొందరు నేతలు ఆరోపించారు.
ఆర్ టి జి ఎస్ నివేదికలు కూడా తెలుగుదేశం ఘోర పరాజయానికి కొంత వరకు కారణం అయ్యాయన్నారు కొందరు నేతలు. కొందరు అధికారులు, నేతలు అంతా అద్భుతంగా ఉందంటూ చంద్రబాబును మోసం చేశారని ఇంకొందరు నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి తెలుగుదేశం ఘోర పరాజయానికి పరోక్షంగా చంద్రబాబే కారణమన్నది మెజారిటీ నేతల అభిప్రాయంగా ఉంది.