కడప ప్రాణం పెట్టింది.. మరి జగన్ ఏం చేస్తాడు?- ఇప్పుడు ఇదే మాట కడప జిల్లాలోని ప్రతి అంగడి(సెంటర్)లోనూ వినిపిస్తోంది. అవును!నిజమే. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కూడా కడప జిల్లా వైఎస్ కుటుంబానికి అండగా నిలిచింది. అయితే, నాటికి నేటికి చాలా తేడా ఉంది. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్న సమయంలోనూ ఒకటో అరో.. టీడీపీ నేతలను గెలిపించారు ఇక్కడి ప్రజలు. కానీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం గుండుగుత్తుగా మొత్తం వైసీపీకే జై కొట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణం తర్వాత దానిని సానుభూతిగా చేసుకుని కనీసం రెండు స్థానాల్లో అయినా పాగావేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు.
అంతేకాదు, తన ప్రయత్నంలో భాగంగా కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఆదరాబాదరాగా ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్తో ఉక్కు సంకల్ప దీక్షను చేయించారు. ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడల్లో భాగమే. దీంతో కనీసం రెండు నుంచి మూడు స్థానాల్లో కడపలో టీడీపీ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, ప్రజలు మాత్రం దీనికి భిన్నంగా తీర్పు ఇచ్చారు. మొత్తం పది స్థానాలను కూడా వైసీపీకి కట్టబెట్టారు. ఇక, ఇక్కడ నుంచి కనీసం ఇద్దరు మంత్రులు ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ, జగన్ సీఎంగా ఉండగా మరో ఇద్దరు మంత్రులకు అవకాశం ఇస్తే.. రాంగ్ అవుతుందని గ్రహించిన వైసీపీ అధినేత.. కేవలం ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చారు.
అది కూడా కడప నుంచి విజయంసాధించిన మైనార్టీ నాయకుడు అంజాద్ బాషాకు మంత్రి వర్గంలో చోటు కల్పించడం తో పాటు.. డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. ఇక, ఇదే జిల్లా రాయచోటి నుంచి వరుస విజయాలు కైవసం చేసుకు న్న శ్రీకాంత్రెడ్డికి చీఫ్ విప్ పదవిని ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఇక్కడి సమస్యలను పరిష్కరించడం ప్రధానంగా ఈ ఇద్ద రిపైనే పడింది. సీఎంగా మొత్తం రాష్ట్ర అభివృద్ధికి జగన్ పట్టుదలతో కృషి చేయాల్సి ఉండగా.. ఈ ఇద్దరూ జిల్లా అభివృ ద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఏవిధంగా ముందుకు వెళ్తారు అనేది ఆసక్తిగా మారింది. అత్యం త కరువు పీడిత రాష్ట్రంగా కడప గుర్తింపు పొందింది.
గత ప్రభుత్వంలో చంద్రబాబు పట్టిసీమ నీటిని పులివెందులకు పారించారు. ఇప్పుడు ఆ నీటిని వినియోగించుకునేలా జగన్ చర్యలు చేపట్టాలి. అదేసమయంలో కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం నుంచి నిధులు సమీకరించాలి. అదేసమయం లో వలస పోతున్న యువతను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కడప నుంచి పొట్ట చేతపట్టుకుని వలస పోతున్న కూలీలకు కూడా ఉపాధి చూపించాల్సిన అవసరం ఉంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను విభజన చట్టంలో ఉన్న విధంగా కడపలో ఏర్పాటు చేయాల్సి ఉంది. మరి ఏవిధంగా అటు సీఎం సహా మంత్రి బాషా, చీఫ్ విప్ శ్రీకాంత్లు ముందుకు వెళ్తారో చూడాలి.