ఎల్లో మీడియానే రాసేసింది..! ఇక తెదేపా లో మిగిలేదెవరు ?
త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కాబోతోందా..? ఆ పార్టీ నుంచి బిజెపిలోకి వలసలు జోరందుకోనున్నాయా? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించ పోతుందా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే వస్తోంది. అంతేకాదు ఈ సమాధానం చెప్పేది కూడా ఏ తెలుగుదేశం వ్యతిరేక మీడియానో కాదు. ఎల్లో మీడియా గా పేరు పడిన 2 పత్రికలు ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి.
ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ పత్రిక గా పేరున్న ప్రముఖ డైలీ ఈరోజు తన బ్యానర్ కథనం లో ఈ విషయాలను ప్రస్తావించింది. తెలుగు దేశం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు, కొందరు మాజీ మంత్రులు, మరి కొందరు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరబోతున్నట్టు బ్యానర్ కథనం రాసింది. తెలుగుదేశానికి చెందిన నెగిటివ్ వార్తలను ఆచితూచి కవర్ చేసే ఆ పత్రిక ఈ స్థాయిలో బ్యానర్ కథనం రాసింది అంటే బీజేపీలోకి తెలుగు దేశం నుంచి వలసల జోరు ఏ స్థాయిలో ఉండబోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
మరి అదే నిజమైతే ఇక తెలుగుదేశం పార్టీలో మిగిలేదెవరు.. సార్వత్రిక ఎన్నికల ముందు తనకు వ్యతిరేకంగా దేశమంతా తిరిగి నందుకు చంద్రబాబుకు మోడీ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా.. వచ్చే ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ మనుగడ సాధ్యం అవుతుందా.. ఇప్పుడు ఇవన్నీ జవాబు తెలియాల్సిన ప్రశ్నలు. కాలమే వీటికి సమాధానం చెప్పాలి.