కేసీఆర్ ఇది ట్రైలరే...ముందుంది అసలు సినిమా
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను బీజేపీ టార్గెట్ చేస్తోంది. తెలంగాణలో ప్రధానప్రతిపక్ష హోదా కోసం తపిస్తూ...ఈ క్రమంలో ముఖ్య నేతకు వలవేస్తోంది. తాజాగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో బీజేపీలో పలు పార్టీల నేతలు చేరారు. టీటీడీపీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, చాడా సురేష్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నేత రహమతుల్లా బీజేపీలో చేరారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు .. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. టీఆరెస్ కీలక నేతలైన కవిత, వినోద్ వంటి నేతలను ఓడించామని..టీఆరెస్ నేతల్లో కూడా అంతర్మథనం ప్రారంభమైందని తెెలిపారు. కేసీఆర్ నియంతృత్వ వైఖరికి భరించలేక టీఆరెస్ నుంచి బీజేపీలో వలసలు మొదలయ్యాయని..ఇది ట్రైలర్ మాత్రమే,అసలు సినిమా ముందుందన్నారు. టీఆరెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందన్న ఆయన..నూతన భవనాలు నిర్మించతలపెట్టిన కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చుతూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న లక్ష్మణ్.. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూ టీఆరెస్ కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే కేసీఆర్ నూతన సచివాలయం, అసెంబ్లీల నిర్మాణాలు చేపడుతున్నారని లక్ష్మణ్ సీరియస్ అయ్యారు.
బీజేపీలో చేరిన పెద్దిరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ,వచ్చే ఎన్నికల్లో బీజేపీ అని అధికారంలోకి తీసుకురావడానికి నిస్వార్ద కార్యకర్తగా పనిచేస్తామని తెలిపారు. తెలంగాణ అప్పుల ఉబినుంచి బయటపడాలంటే బిజేపి అధికారంలోకి రావాలని అయన అన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మరికొందరు పార్టీలోకి చేరతారని ప్రకటించారు.