జగన్ బాటలో మాజీ ప్రధాని..సంచలన నిర్ణయం తీసుకున్న దేవేగౌడ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ రికార్డులను తిరగరాస్తూ మునుపెన్నూడూ లేని రీతిలో విజయం సాధించి వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపు దేశంలోని ముఖ్యనేతలను ఆకర్షిస్తోంది. గెలుపు కోసం జగన్ దారిలో నడవాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా, మాజీ ప్రధానమంత్రి, జెడిఎస్ చీఫ్ హెచ్ డి దేవెగౌడ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవేగౌడ సారథ్యంలోని జేడీఎస్ ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో దుమ్మురేపిన నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి బాటలో నడిచేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం తీసుకురావాలని భావిస్తోంది.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాల్లో 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం.. జేడీఎస్, కాంగ్రెస్లకు చెరో స్థానం మాత్రమే దక్కిన సంగతి తెలిసిందే. మరో స్థానంలో బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లో చవి చూసిన ఘోర వైఫల్యంతో జేడీఎస్ అంతర్మథనంలో పడింది. లోక్ సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న జనతాదళ్ (సెక్యులర్) కర్ణాటకలో పార్టీకి పునరుజ్జీవం పోసే ప్రయత్నాలు ప్రారంభించింది. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ప్రధానమంత్రి, జెడిఎస్ చీఫ్ హెచ్ డి దేవెగౌడ కనుసన్నలలో ఈ పాదయాత్ర కార్యక్రమం రూపుదిద్దుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే వైఎస్వీ దత్తా నాయకత్వాన ఆగస్టులో బీదర్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమై బెంగుళూరులో ముగుస్తుంది. ఈ యాత్రలో నాయకులు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరిస్తారు.
పార్టీని పునర్నిర్మించేందుకు కష్టపడి పనిచేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు దేవేగౌడ పిలుపునిచ్చారు. 'సంకీర్ణ ప్రభుత్వ సెంటిమెంట్లను దెబ్బతీయకుండా, ప్లకార్డులు ప్రదర్శించకుండా పాదయాత్ర జరుగుతుందని, స్థానిక ప్రజా సమస్యలకు ప్రతిస్పందించని కారణంగా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని' ప్రజలకు వివరించనున్నట్టు దేవెగౌడ సన్నిహితులు చెప్పారు. త్వరలోనే సక్లేశ్ పూర్ ఎమ్మెల్యే హెచ్ కె కుమారస్వామిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నారు. దీని ద్వారా కేవలం ఒక్కళిక వర్గం కోసమే తాము పని చేయడం లేదని తెలియజెప్పాలని భావిస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.