విజయసాయిరెడ్డి జగన్ వెన్నటి ఉన్న నాయకుడు. జగన్ తో ఎంతో మంది కలసి నడిచారు కానీ ఆయన అత్మ బంధువుగా మాత్రం విజయసాయిరెడ్డినే చెబుతారు. జగన్ తో ఉన్న చనువు అలాంటిది. జగన్ సైతం విజయసాయిరెడ్డి మాట వింటారని అంటారు. ఇలా ఈ ఇద్దరూ కలసి నడిచి పదేళ్ళయింది. విజయసాయిరెడ్డి అధికారంలో లేనపుడు ఎన్నో కష్టాలు పడి పార్టీకి కొమ్ము కాశారు.
అటువంటి విజయసాయిరెడ్డి రుణం తీర్చుకోవాలని జగన్ ఆయనకే పదవులు ఇస్తూ వస్తున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డిని నియమించారు. ఇక ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కూడా క్యాబినేట్ ర్యాంక్ పదవి ఆయనకే ఇచ్చారు. అయితే లాభదాయకమైన పదవుల్లో ఎంపీలు ఉండరాదన్న కారణంగా గత నెలలో జారీ చేసిన జీవోని ఈ నెల 4న రద్దు చేశారు.
ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఆయనకు ఉన్న పరిచయాల కారణంగా సీఎం జగన్ ఆయనకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, అధికారుల అవగాహన లోపం కారణంగా వివాదం ఏర్పడింది. చివరకు దీనిని ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసి తిరిగి విజయ సాయిరెడ్డికే ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ తన నిర్ణయాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డికి పార్టీలో, జగన్ హ్రుదయంలో ఉన్న స్థానం ఏంటన్నది ఈ ఘటన రుజువు చేసింది.