రాజకీయ అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు తీవ్రమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. గడిచిన ఐదేళ్ల పాలనను కూడా జగన్ అవినీతి, అక్రమాల మయంగా నిరూపిస్తుంటే.. ఏం చేయాలో తెలియని పరిస్థితిని చవిచూస్తున్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో ``నేను అవసరమైతే.. రోడ్డుపై పడుకుంటాను!``- అని చంద్రబాబు సాక్షాత్తూ అసెంబ్లీలోనే ప్రకటించడం వెనుక జగన్ దూకుడును తనకు అనుకూలంగా మార్చుకు నేందుకు కసరత్తు ప్రారంభించారనే ఉద్దేశం బయటపడుతోంది. నిజానికి చంద్రబాబుకు సెంటిమెంట్ రాజకీయాలు బాగా చేస్తారనే పేరు ఉంది.
ఎలాంటి సంఘటననైనా తనకు అనుకూలంగా మార్చుకుని, ఆయన దాని నుంచి లబ్ధి పొందాలని చూస్తారు. ఈ క్రమం లో రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఆయన అనేక యూటర్న్ లుతీసుకున్నారు. జగన్పై హత్యా ప్రయత్నం జరిగితే.. దా నిని కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. ప్రతి విషయాన్ని సెంటిమెంటుకు ముడిపెట్టి దాని నుంచి రాజకీయాలు చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అదే తరహాలో జగన్ దూకుడునుకూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ప్రజావేదికను కూల్చి వేయడాన్ని తప్పు పట్టారు. అదేసమయంలో తాను ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ను కూల్చి వేస్తామన్న జగన్ ఆదేశాలను కూడా సెంటిమెంటుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రాష్ట్రంలోని 72 వేల అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తారా? అంటూ.. ప్రశ్నించడం, రాష్ట్రంలో రోడ్లకు మద్యలో ఉన్న వైఎస్ విగ్రహాలు కూడా అడ్డంగా ఉన్నాయని, వాటి వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని కూడా తీసే స్తారా? అని ప్రశ్నించారు.
వాస్తవానికి ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం చెబుతుంటే.. మౌనంగా తప్పుకొని అధికార పార్టీకి సవాలు విసిరే అవకాశం ఉన్నా.. తనను ఇంటి నుంచి వెళ్లగొడితే.. అవసరమైతే.. రోడ్డుపై పడుకుంటాను. నా ప్రజల కోసం ఏమైనా చేసేందుకు నేను సిద్ధమే అని ప్రకటించడం ఆయన సెంటిమెంట్ రాజకీయాలకు పరాకాష్టగా మారింది. అక్రమ నిర్మాణాలను సాధారణ పౌరులే దేబిరించుకుంటున్నప్పుడు ఓ మాజీ సీఎం ఇలా వ్యాఖ్యానించి.. తనకు అనుకూలంగా పరిస్థితిని సెంటిమెంట్గా వాడుకోవాలని అనుకోవడం ఆయనకే ముప్పని అంటున్నారు పరిశీలకులు.