ఎత్తుకు పై ఎత్తు: జగన్ దెబ్బకు టెన్షన్లో ఎంఎల్ఏలు
అధికారపార్టీలో ఎత్తుకు
పై ఎత్తులు సాగుతున్నాయి. ఉద్యోగుల బదిలీల విషయంలో సిఫార్సుల ఆధారంగా కాకుండా
మెరిట్ మీదే బదిలీలు చేయాలని జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టంగా
ఆదేశాలిచ్చారు. అదే సమయంలో బదిలీల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రులు, ఎంఎల్ఏలకు
కూడా చెప్పారు. కానీ ఆచరణలో సాధ్యం కాలేదు.
ఇంతకీ జరిగిందేమిటంటే అన్నీ శాఖల్లోను ఉద్యోగుల బదిలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. దాంతో ఉద్యోగులు తమకు కావాల్సిన చోటుకు బదిలీ చేయించుకునేందుకు మంత్రులు, ఎంఎల్ఏలతో ఒత్తిడి పెట్టించటం, రికమెండేషన్ లెటర్లు ఇప్పించుకున్నారు. సరే తప్పదు కాబట్టి ఉన్నతాధికారులు కూడా రికమెండేషన్ లెటర్లను పరిగణలోకి తీసుకున్నారు.
సమస్య అంతా ఇక్కడే వచ్చింది. ఉద్యోగుల బదిలీల విషయాల్లో జోక్యం చేసుకున్న మంత్రులు, ఎంఎల్ఏల జాబితాను జగన్ సేకరించారట. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు ఎవరెవరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చారనే జాబితాను తెప్పించుకున్నారట. రికమెండేషన్ లెటర్ల జిరాక్స్ కాపీలను సిఎంవో వివిధ జిల్లాల నుండి తెప్పించుకుందని మంత్రులు, ఎంఎల్ఏలకు కూడా తెలిసిపోయింది.
ఎప్పుడైతే తమ విషయం జగన్ కు తెలిసిందని వీళ్ళకు అర్ధమైపోయిందో అప్పటి నుండి వాళ్ళల్లో టెన్షన్ మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు కాగానే ఎవరెవరు ఎన్ని లెటర్లు ఇచ్చారో లెక్కలు తీసి నేరుగా వాళ్ళతోనే మాట్లాడాలని జగన్ డిసైడ్ అయ్యారట. దాంతో టెన్షన్ పెరిగిపోతోంది.